ఐదు రూపాయలకే నేల టిక్కెట్.. ఏపీలో పంచాయితీల్లో ఉండే థియేటర్లలో ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇది. బయట ఈ రేటుకు టీ కూడా దొరకదు.. కానీ కోట్లాది రూపాయలతో తీసిన సినిమాని ఎంచక్కా చూసేయొచ్చు. ఇలాంటి టిక్కెట్ల ధరతో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేయడంతో సినీ జనాల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ నెత్తిమీద పూల వర్షం కురిసినట్లయింది. బాలయ్య అఖండకు మాత్రం కొంత దెబ్బపడినట్టుగానే భావించాలి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టిక్కెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. వీరి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఫలితంగా ఇంతకుముందు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ జీవోను ఈ ఏడాది ఏప్రిల్ లో జారీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సినీ పరిశ్రమ వర్గాలు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. టిక్కెట్ల ధరలను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.
ఈ ధరల మీద పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ మీటింగులో దీని మీద మాట్లాడారు. అవసరమైన తన సినిమాను జనానికి ఫ్రీగా చూపిస్తానన్న స్టేట్ మెంట్ ను కూడా పవన్ కళ్యాణ్ చేశారు. మొత్తానికి ఈ విషయంలో థియేటర్ యజమానులు చేసిన పోరాటం కోర్టు నిర్ణయంతో విజయవంతమైంది. వరుసగా విడుదలయ్యే పెద్ద సినిమాలకు ఇది ఎంతో ఊతం ఇస్తుందని చెప్పాలి. కాకపోతే ప్రజల మీద కొంత భారం పడక తప్పదు. కోట్లు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు కోలుకోవాలంటే టిక్కెట్ల ధర పెంపు నిర్ణయం సమంజసమేననాలి.
Must Read ;- జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో చెంపదెబ్బ..! సినిమా టికెట్ ధరల జీవో సస్పెండ్!!











