ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఈవెంట్ పై సీరియస్ అయిన పోలీసులు కేసు నమోదు చేశారు.
కారణం ఏంటంటే.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు 5వేల కంటే ఎక్కువ మంది రావడం.. సామాన్య జనం ఇబ్బందులు పాలయ్యారని ఫిర్యాదులు రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు సీరియస్ అయి కేసు నమోదు చేయడం జరిగింది. శ్రేయాస్ ఈవెంట్ మేనేజర్ కిషోర్ మీద 143, 341, 336, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేవలం 5000 పాస్ లకు మాత్రమే అనుమతి తీసుకుని ఎక్కువ పాస్ లు జారీ చేశారని నిర్ధారించుకున్న పోలీసులు శ్రేయాస్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ పై కేసులు నమోదుచేశారు.
ఆదివారం ఉదయం నుంచే యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ కు బన్నీ అభిమానులు భారీగా తరలి వచ్చారు. వేల సంఖ్యలో అనుకున్న దానికి మించి రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతే కాకుండా ఓ దశలో తొక్కిసలాట జరిగింది. అయితే అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావడాన్ని గమనించిన ఈవెంట్ మేనేజ్మెంట్ వారు అభిమానుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Must Read ;- పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు