(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
అశోక్ బంగ్లా .. విజయనగరం తెలుగుదేశం పార్టీకి కేంద్ర బిందువు. నాయకులు, కార్యకర్తల రాకపోకలు, సమావేశాలు .. చర్చలతో కోలాహలంగా ఉండే ఈ బంగ్లా ఏడాదిన్నరగా బోసి పోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన పూసపాటి అశోక్ గజపతి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ నుండి అభ్యర్థిగా నిలిచిన అదితి గజపతి.. ఇరువురూ ఓటమి పాలవ్వడంతో వారి కుటుంబంలో కొంత నైరాశ్యం నెలకొంది. దానికి కరోనా తోడవ్వడంతో బంగ్లా గేట్లను బంద్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంగ్లాకు దూరమయ్యారు. పార్టీలో పూర్తి స్తబ్దత నెలకొనడంతో నాయకులు ఎవరికి వారుగా చెల్లాచెదురయ్యారు. ఇదే అదనుగా అసమ్మతి వర్గం జడలు విప్పింది. జిల్లా కేంద్రంలోనే వేరే కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమైంది. అశోక్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహం రూపొందించింది. మరో పక్క అధికార పార్టీ వైసీపీ మాన్సాస్ను తన గుప్పెట్లో పెట్టుకుని అశోక్ ను మానసికంగా దెబ్బ తీసింది.
వ్యూహాత్మకంగా ..
రాజకీయ దురంధరుడుగా పేరుగాంచిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా, మానసికంగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు తన గారాల పట్టి, విజయనగరం టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అదితి పుట్టిన రోజును పండుగగా మార్చేశారు. బంగ్లా గేట్లను బార్లా తెరి చేశారు. విజయనగరం నియోజకవర్గంలో ప్రతి వార్డులో ఫ్లెక్సీలు వేయించారు. కేక్ కటింగ్, సంబరాలు నిర్వహించారు. బంగ్లాకు అందరినీ స్వాగతించారు. దాంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఒకేసారి కోలాహలం, నూతనోత్సాహం మొదలైంది. పెద్ద సంఖ్యలో బంగ్లాకు చేరుకుని అదితిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆ కార్యక్రమంలో ఆద్యంతం పాల్గొన్న అశోక్ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు.
సంప్రదాయానికి భిన్నంగా ..
పూసపాటి వంశీయుల వారసుడుగా , కేంద్ర మంత్రిగా, టీడీపీలో నెంబర్ 2గా చెలామణి అయిన రోజుల్లోనూ, తన 70 ఏళ్ల జీవిత చరిత్రలోనూ ఇంకెన్నడూ, ఏ విషయంలోనూ ఇంత పెద్దెత్తున సంబరాలు జరుపుకోని అశోక్ .. సంప్రదాయానికి విరుద్ధంగా ఇలా వ్యవహరించడం జిల్లా వ్యాప్తంగా, విపక్షాల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి కారణం ఏంటని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేని విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న అశోక్ వాటికి చెక్ పెట్టేందుకు, పూర్వ వైభవం తెచ్చేందుకు, రానున్న స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రణాళిక యుతంగా వ్యవహరించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి.
Also Read: తిరుపతి పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి











