(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం రామతీర్థం ధర్మయాత్రకు భాజపా – జనసేన సంయుక్తంగా పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ధర్మయాత్ర కోసం అక్కడికి చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆపార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట, తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ సందర్భంగా సోము వీర్రాజుతో పాటు, జిల్లా నాయకులు గద్దె బాబూరావు, జనసేన జిల్లా అధ్యక్షురాలు పాలవలస యశస్వని తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు పహరాలో రామతీర్థం
విజయనగరం డివిజన్లో ఈ నెలాఖరు వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రామతీర్థం కూడలి నుంచి దేవస్థానం వరకు, బోడికొండపై కోదండరాముని దేవాలయం వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. సీతారామునిపేట కూడలి వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బోడికొండ మెట్ల వద్ద మరింత భద్రతకు బలగాలను మోహరించారు. కొండపైకి వెళ్లకుండా బారికేడ్లను సిద్ధంగా ఉంచారు. పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పలువురి అరెస్టు
రామతీర్థం వెళ్ళేందుకు ప్రయత్నించిన రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చ కార్యదర్శి సనపల బాలకృష్ణ, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు హరనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ కుమార్, నెల్లిమర్ల నియోజకవర్గం ఇంఛార్జి పతివాడ రమణ, ఆచారి నళిని శాంతి తదితరులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన : సోము వీర్రాజు
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, రామతీర్థంలోని కోదండరాముని దర్శనానికి వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డికి అనుమతి ఇచ్చి తమకు ఎందుకు అనుమతివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గురువారం ఆయన విజయనగరం జిల్లా రామతీర్థం కూడలిలో మీడియాతో మాట్లాడారు. ఎన్ని అరెస్టులు జరిగినా ఇక్కడి నుండి కదిలేదని ఆయన చెప్పారు.
విజయనగరం రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రామతీర్థం వెళ్తున్న బీజేపీ కీలక నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులను నెల్లిమర్ల వద్ద పోలీసులు ఆపేశారు. వారు ముందుకు వెళ్లకుండా బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు.ఈ క్రమంలో బీజేపీ నేతలు-పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొండపై దేవాలయాన్ని చూసిన తర్వాతే తాము ఇక్కడి నుండి వెళ్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. రామతీర్థంకు ఐదుగుర్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. దానికి బీజేపీ – జనసేన శ్రేణులు ససేమిరా అనటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Must Read ;- రామతీర్థం సమస్యను సర్కారు రాజకీయం చేస్తోంది : సీపీఎం