గంటలో పెళ్లి. ఇరు కుంటుంబాల వాళ్లు పెళ్లికి అంతా సిద్ధం చేశారు. అంతా అనుకున్న ప్రకారమే జరుగుతుంది కదా అని భావించారు. కాసేపట్లో వధువు మెడలో తాళి పడుతుందనేలోపే వరుడి కుటుంబానికి వధువు షాకిచ్చింది. అలా చేస్తుందని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. కట్ చేస్తే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పెళ్లి ఆగిపోయింది.
వధువు ఇచ్చిన ఈ ట్విస్ట్ వెనుకాల అసలు కారణమేంటంటే తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తన ప్రియుడి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పెళ్లి ఆగిపోయింది. తనకు బలవంతంగా పెళ్లిచేస్తున్నారని పోలీసులకు వధువు తెలిపడంతో తహశీల్దార్ సమక్షంలో ఆ వధువును చెన్నైకి పంపించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన వ్యక్తితో కడప జిల్లాకు చెందిన వధువుతో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. కళ్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలో పెళ్లి ఆగిపోయింది. వధువు ఇచ్చిన షాక్కి వరుడి తరుపు బంధువులకు పాలుపోలేదు. పెళ్లి ఇష్టం లేకుంటే ముందే చెప్పాలి కదా? అని ప్రశ్నించారు. పీటలు దాకా వచ్చి పెళ్లి ఇష్టం లేదంటే ఎలా అని వాపోయారు. వధువు చేసిన ఈ పనికి పెళ్లికి వచ్చిన వారు కొందరు పెదవి విరిచారు. ఇలాంటి తరహా పెళ్లి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగులోకి వస్తుండటం గమనార్హం.
Must Read ;- నా ప్రియుడు రాకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా