టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు గురువారం మరో రెండు పతకాలు దక్కాయి. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని చేజిక్కించుకోగా.. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత యోధుడు రవికుమార్ దహియాకు రజతం లభించింది. స్వర్ణం కోసం జరిగిన పోరులో రవికుమార్ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ ఫైనల్ పోరులో ఉగుయేవ్ కు 7 పాయింట్లు దక్కగా, రవికుమార్ 4 పాయింట్లే సాధించి రజతంతో సరిపెట్టుకున్నాడు.
అంచనాలు మించి ప్రదర్శన
హాకీలో తొలుత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా మెరుగైన ప్రదర్శనతో అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్స్ దాటిన రెండు జట్లు సెమీస్ లో ఓడిపోయాయి. ఆ తర్వాత కాంస్యం కోసం జరిగిన పోరులో పురుషుల జట్టు సత్తా చాటి పతకాన్ని సాధించగా.. మహిళల జట్టు మాత్రం పరాజయం పాలైంది. ఇక రెజ్లింగ్ లో అంచనాలకు మించి ప్రదర్శన కనబరచిన రవికుమార్ దహియా ఒక్కటొక్కటిగానే గెలుస్తూ ఫైనల్ చేరుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఒలింపిక్స్ లో దహియా దేశానికి స్వర్ణ పతకం సాధించడం ఖాయమన్న వాదనలు వినిపించాయి. అయితే స్వర్ణ పతకం కోసం జరిగిన తుది పోరులో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. చివరిదాకా పోరాడినా.. పాయింట్ల పట్టికలో వెనుకబడ్డ దహియా.. రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రోత్సాహకాల వెల్లువ
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన రవికుమార్ దహియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశానికి ఈ ఒలింపిక్స్ లో రెండో రజత పతకాన్ని సాధించిన దహియా పోరాట పటిమపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానా సర్కారు అతడికి ఏకంగా రూ.4 కోట్ల క్యాష్ ప్రైజ్ ను ప్రకటింది. అంతేకాకుండా అతడికి గ్రూప్1 ఉద్యోగాన్ని ప్రకటించింది. రవికి కూడా ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయుడు అభినందనలు తెలిపారు. మరోవైపు హాకీలో ఏకంగా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 41 ఏళ్ల తర్వాత హాకీలో పతకం సాధించిన జట్టుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు హాకీ జట్టుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పతకం సాధించిన హాకీ జట్టుపైనా క్యాష్ ప్రైజ్ ల వెల్లువ కురుస్తోంది.
Must Read ;- వన్ అండ్ ఓన్లీ లేడీ.. పీవీ సింధు










