జూలై నెల సమీపిస్తోందంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. జగన్కు సంబంధించి పలు కీలక కేసుల విచారణను సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం చేపట్టనుంది. బుధవారం వేసవి సెలవులు పూర్తి కానుండగా… గురువారం నుంచి సుప్రీంకోర్టులో విచారణలు యథావిధిగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగన్కు సంబంధించిన పలు కీలక కేసులు విచారణకు రానున్నాయి. వాటిలో ఓ మూడు సంచలన కేసులున్నాయి. ఈ కేసుల గురించి ఆలోచన చేసినా… సుప్రీంకోర్టు విచారణ సమీపిస్తున్న వైనం దగ్గరపడుతున్నా… జగన్లో టెన్షన్ అమాంతంగా పెరిగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్లో జూలై టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది.
సుప్రీంకోర్టులో రెండు కీలక కేసుల విచారణ
వైసీపీ రెబల్ ఎంపీ, నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు అరెస్ట్ సందర్భంగా ఆయనతో పాటు ఆయన వీడియోలను ప్రసారం చేశాయన్న కారణంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 సంస్థలపై ఏపీ సీఐడీ రాజద్రోహం కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ చేసిన సందర్భంగా తనపై ఏకంగా పోలీసు కస్టడీలోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ఏబీఎన్ రాధాకృష్ణ కూడా జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన రాజద్రోహం కేసులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్లో జూలై తొలి వారంలోనే సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అదే సమయంలో జూలై రెండో వారంలో రఘురామ పిటిషన్ పై విచారణ జరగనుంది.
జగన్ బెయిల్ రద్దవుతుందా?
ఇక అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ రఘురామరాజు సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ చేపట్టింది. జగన్ కౌంటర్, దానికి రఘురామ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ ముగిసినట్టు ప్రకటించిన సీబీఐ కోర్టు జూలైలో తన తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పులో జగన్ బెయిల్ను రద్దు చేస్తున్నట్లుగా కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తంగా జూలై నెలలో ఈ మూడు కేసుల విచారణ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందనే వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో జూలై నెలలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- సుప్రీంలో ’ఇన్సైడర్‘.. జగన్ పంతం నెగ్గేనా?