వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం పాలన సాగిస్తోందని,ప్రశ్నించిన వారిపై వేధింపులకు దిగుతోందని మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టవ్యతిరేక పాలన నడుస్తోందని, దీనికి రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.డిజిటల్ మహానాడులో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దురుద్దేశ పూర్వకంగా,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వాన్ని మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడిని చేసి చంపారని,టీడీపీ కీలక నేత కోడెల శివప్రసాద్ నుంచి మొదలు డా.సుధాకర్ వరకు ఎంతోమంది వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక చనిపోయారని వ్యాఖ్యానించారు.తాత్కాలిక పదవుల కోసం రాష్ట్రాన్ని స్టేట్ టెర్రరిజంగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.ఇక వైసీపీ ప్రభుత్వం చేతగాని తనం కారణంగా ఆక్సిజన్ లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.కలసి పనిచేద్దామని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నా బాధ్యత లేకుండా విమర్శిస్తున్నారని,గతంలో తన సలహాలు,సూచనలను ఎగతాళి చేశారని,పారాసిట్మాల్,బ్లీచింగ్తో పోతుందని మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఆనందయ్య వైద్యం విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని,ఆనందయ్య వైద్యంపై తప్పు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా ఆనందయ్య కుటుంబాన్ని పరామర్శించే టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.జగన్ హయాంలో వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారని,న్యాయస్థానాల్ని కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజా స్వామ్యానికి పెను ప్రమాదమని హెచ్చరించారు.అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసులు బీసీ జనార్థన్ రెడ్డి వరకూ కొనసాగించారని,వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించి కప్పిబుచ్చుకునే యత్నం చేశారని,చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో దొరికిపోయారన్నారు.
సమాజ హితం కోసం..
తెలుగుజాతి ఔన్నత్యానికి దివంగత ఎన్టీఆర్ పాటుపడ్డారని,సమాజ హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు,నాయకులు చేసిన త్యాగాలను పార్టీ మర్చిపోదని వ్యాఖ్యానించారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని,ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై,చేయని తప్పులకు వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణుల కుటుంబ సభ్యుల్ని తలచి నిద్రపోని రాత్రులు గడిపానని వ్యాఖ్యానించారు.
కొవిడ్ కన్నా ప్రతిపక్ష పార్టీ నాయకుల అరెస్టులపై దృష్టి : ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ను అరికట్టడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకుల అరెస్టులపై దృష్టి పెడుతోందని విమర్శించారు. కొవిడ్ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని,కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు.కొవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు,తలకిందులైన కుటుంబ ఆదాయం అంశంపై రామ్మోహన్నాయుడు మాట్లాడారు.అందరికీ వ్యాక్సిన్ అందించడంతో పాటు బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని,ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
లేఖలతో వ్యాక్సిన్లు రావు: నిమ్మల రామానాయుడు
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్కు డిమాండ్ ఉన్నందున వేగంగా స్పందించి సేకరించాల్సిన ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందన్నారు.కరోనా రెండో దశలో కేసుల సంఖ్య 20 రెట్లు పెరిగినా ప్రభుత్వం టీకాలు తెప్పించే యత్నం చేయకపోగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తోందన్నారు.వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు సీఎం లేఖలు రాస్తున్నారని చెబుతున్నారని,లేఖలు రాస్తే వ్యాక్సిన్లు రావని రామానాయుడు ఎద్దేవా చేశారు.
నవరత్నాల పేరిట నకిలీ రత్నాలు: కూన రవికుమార్
ఇక నవరత్నాల అమలు అంశంపై టీడీపీ నేత కూన రవికుమార్ మాట్లాడుతూ దొంగ లెక్కలు రాయడంలో ఆరితేరిన వారంతా ఒకేచోట చేరి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని,రాష్ట్ర భవిష్యత్ను నాశనం చేస్తున్నారన్నారు.నవరత్నాల పేరిట నకిలీ రత్నాలు ఇస్తున్నారని,టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 40 పథకాలను రద్దు చేసి ఇప్పుడు 9 పథకాలు ఇస్తూ నవరత్నాలు అని ప్రచారం చేస్తున్నారన్నారు.
MUst read ;- జగన్ను నమ్ముకుంటే జైలు తప్పదు : చంద్రబాబు