ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని భూసేకరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుత వైసీపీ సర్కారు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులను అందజేశారు. 41CRPC కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని, సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ఏపీ సీఐడీ నోటీసులు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసుకు సంబధించి ఇప్పటికే 8 మందికి నోటీసులు జారీ చేసిన సీఐడీ తాజాగా చంద్రబాబుకూ నోటీసులు జారీ చేసింది. మొత్తం 6 సభ్యులతో కూడిన టీం చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ అంశంపై అటు సీఐడీ అధికారులు, ఇటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ విషయంలో సుప్రీంకోర్టు సవరణలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసులో విచారణను వేగవంతం చేసిందని చెప్పవచ్చు.
ఇప్పటికే కేసు నమోదు..
ఈ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి నారాయణను విచారించారు సీఐడీ అధికారులు. భూసేకరణలో పలు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఐటీకి లేఖ..
ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ , అసైన్డ్ భూముల కొనుగోళ్లు తదితర అంశాలపై జరిగిన లావాదేవీల్లో విచారణకు సహకరించాల్సిందిగా ఏపీ సీఐడీ ఆదాయపు పన్ను శాఖను కోరింది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పటికే ఐటీ చీఫ్ కమిషనర్కు లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకు 106 అనుమానాస్పద భూ లావాదేవీలు జరిగినట్లు ఈ లేఖలో సీఐడీ చీఫ్ సునీల్ పేర్కొన్నట్లు సమాచారం. వాటిలో నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిగిన వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిగిన లావాదేవీలపై చర్యలు తీసుకోవడంతో ఆ వివరాలు తమకు తెలియజేస్తే తమ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, విచారణకు కూడా సహకరించినట్టు అవుతుందని లేఖ రాసినట్టు తెలుస్తోంది.
సీబీఐ విచారణ కోరిన జగన్ సర్కారు
కాగా రాజధాని భూముల వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కోరుతూ జగన్ ప్రభుత్వం లేఖ రాసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ, సీబీఐ దర్యాప్తును కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అమరావతి భూసేకరణ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన కేసుల వివరాలతో పాటు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేశామని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబును ఈ కేసులో ఇరికించే యత్నం
కాగా ఉద్దేశపూర్వకంగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఈ కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కక్ష గట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఏదో ఒక కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారని విమర్శిస్తోంది.
Must Read ;- నో ఇన్ సైడర్ ట్రేడింగ్ : అమరావతి కేసుల్లో ఆ పదం వర్తించదు!