దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనతో పాటు ఆసుపత్రుల్లో బెడ్ల కొరత కూడా ఇబ్బంది కలిగిస్తోంది. ఆక్సిజన్ కొరత, రెమిడెసివిర్ బ్లాక్ చేయడం లాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిత్యం వేలాది మంది చనిపోతుండడం, బెడ్లు, ఆక్సిజన్ కొరత కూడా ఇందుకు పరోక్షంగా కారణం అనే వార్తలు వస్తున్న వేళ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వినూత్న ట్వీట్ చేశారు. అవసరం లేని వారు స్వచ్ఛందంగా ఆసుపత్రి బెడ్లను వీడాలని, తద్వారా అత్యవసరమైన వారికి ఆ బెడ్లు అందుబాటులోకి వస్తాయని, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారిని రక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ ట్వీట్..
‘ నాగ్పూర్లో 85 ఏళ్ల నారాయణ దబాల్కర్ అనే వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే ఆయన చాలా అనారోగ్యం పాలయ్యారు. తరువాత సదరు వ్యక్తి చనిపోయారు. అయితే ఆయన చనిపోయే కంటే రెండు రోజుల ముందు స్వచ్ఛందంగా ఆసుపత్రి వీడాడు.అందుకు కారణం కూడా ఉంది. ఓ మహిళ కొవిడ్తో బాధపడుతున్న తన నలభై ఏళ్ల భర్తకు బెడ్ కోసం ఆసుపత్రిలో ప్రాధేయ పడుతుండడం చూశాడు. తాను జీవితంలో అన్నీ అనుభవించానని,తనకూ ఇంకా బతకాలనే ఉందని, కాని తనకంటే ఆ నలభై ఏళ్ల వ్యక్తి బతకడం చాలా అవసరమని, అందుకు తన బెడ్ అతనికి ఇవ్వాలని చెప్పి ఆసుపత్రిని వీడాడు. ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులెవరనే కంటే.. సదుద్దేశం గమనించాలి. అదే హిందూస్థాన్. అదే భారతీయ సంస్కృతి. ప్రస్తుతం కరోనా వల్ల అంతర్జాతీయంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత వరకు వనరులను తక్కువగా వాడుకోవడం ద్వారా ఇతరులకు వాటిని వాడుకునే అవకాశం కల్పించాలి.
నేను ధనవంతులకు విన్నవిస్తున్నా. కొంతమంది కరోనా వచ్చిందనే కారణంలో స్వల్ప లక్షణాలతో ఆసుపత్రుల్లో బెడ్లు బుక్ చేస్తున్నారు. వారి ఆందోళన అర్థం చేసుకోదగిందే. అయితే ఆవసరం లేకున్నా ఆసుపత్రుల్లో బెడ్లు బుక్ చేసుకుంటే, అత్యవసర పరిస్థితి ఉన్నవారికి బెడ్ దొరకకుండా పోతుంది. మీ దగ్గర డబ్బు ఉండడం సంతోషించదగినదే.అయితే అవసరం లేకున్నా బెడ్లు బుక్ చేసుకునేందుకు ఆ డబ్బును, హోదాను మాత్రం వినియోగించవద్దు.అలా చేస్తే అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి మీరు బెడ్ లేకుండా చేసినవారు అవుతారు. సమాజం కోసం కూడా ఆలోచించాలని విన్నవిస్తున్నా.మానవత్వంతో ఆలోచించి అవసరం లేని వారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావాలి. సానుకూలంగా ఆలోచిద్దాం’ అని ట్వీట్ చేశారు.
ఇదే ట్వీట్లో ప్రముఖ కవి లియో టాల్ స్టాయ్ రాసిన మాటలను ఊటంకించారు. ‘నువ్వు బాధను అనుభవిస్తున్నావంటే నువ్వు బతికి ఉన్నావని అర్థం.అదే బాధ ఇతరులకు ఉంటుందని అర్థం చేసుకుంటే మనిషివని అర్థం అని పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్లో 6P సూత్రాన్ని పోస్ట్ చేశారు. అవి ప్లేస్, ప్రిస్కిప్షన్, ప్రామిస్, ప్రైస్, ప్రైవసీ, ప్రొడక్ట్ లకు సంబంధించి ట్వీట్ చేశారు.
ఇక కరోనా కేసుల విషయానికి వస్తే.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 7,646 కొత్త కేసులు నమోదయ్యాయి. 53 మంది చనిపోయారు. ఏపీలో 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.57 మంది మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో మొత్తం 3, 86, 452 కరోనా కేసులు నమోదయ్యాయి.3,498మంది మరణించారు. భారత్లో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1.87కోట్లకు చేరింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒక్క మహారాష్ట్రలోనే 66వేల కేసులు, కేరళలో 38వేల కేసులు, కర్ణాటకలో 35వేల కేసులు, ఢిల్లీలో 24వేల కేసులు నమోదయ్యాయి.
Must Read ;- నిబంధనల పేరుతో సర్కారు వేధింపులు.. కడపలో ప్రైవేటు వైద్యుల తిరుగుబాటు
Humanity is put to test during such crisis period. Understand the grave situation which less privileged are facing. Help them if you can. This is the true Religion. pic.twitter.com/zQPzptOveg
— CP Hyderabad City Police (@CPHydCity) April 29, 2021











