సెకండ్ వేవ్ కరోనా భారత్లో విలయతాండవం చేస్తోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ కారణంగా ఓవైపు ఆక్సిజన్ కొరత..మరోవైపు బెడ్ల కొరత తలెత్తుతోంది. ఆసుపత్రులు ఫుల్ అవుతున్నాయి. ఇక కొవిడ్తో మృతి చెందినవారి అంత్యక్రియలకు సంబంధించి కూడా శ్మశానాల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ, తెలంగాణల విషయానికి వస్తే ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరత లేకుండా, బెడ్ల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అదే సమయంలో శ్మశానాల్లో రద్దీ, బెడ్ల కొరతకు సంబంధించి మీడియాల్లోనూ పలు కథనాలు వస్తున్నాయి.
పరిస్థితి ఇదీ..
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 619 ఐసీయూ పడకల్లో చాలా వరకు నిండిపోయాయి. కొద్దిగా కోలుకున్న వారిని ఆక్సిజన్ సరఫరా విభాగం నుంచి వేరే విభాగానికి మార్చి, అత్యవసర పరిస్థితి ఉన్నవారిని చేర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పేషెంట్లతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితి చేయిదాటాక ఇక్కడికి తీసుకొస్తున్నవారూ ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. గాంధీ ఆసుపత్రి కాకుండా టిమ్స్లో వెయ్యి పడకలు ఉండగా 137 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. అదనంగా 843 పడకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిలోగురువారం రాత్రి వరకు 100 మంది చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఛాతీ ఆసుపత్రిలో 124 వెంటిలేటర్ పడకలు, కోఠి ఆసుపత్రిలో 45 పడకలు ఫుల్ అయ్యాయి. ఫీవర్ ఆసుపత్రి, ఆయుర్వేద, నేచర్క్యూర్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల్లో సాధారణ పడకలు ఎక్కువగా అందుబాటులో ఉండగా ఆక్సిజన సరఫరా చేసే పడకలు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కేసులు పెరగడంతో బెడ్ల సంఖ్య పెంచారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 270 నుంచి 500 వరకు పెంచగా ఫుల్ అయ్యాయి. బోధన్, ఆర్మూర్లో 100 చొప్పున పడకలను పెంచారు. తెలంగాణలో కొత్త యూనిట్ల ఏర్పాట్లు, మెడికల్ కాలేజీల్లో బెడ్ల ఏర్పాటు తదితర చర్యల వల్ల త్వరలోనే మరో వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ విషయానికి వస్తే..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం 700 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ దాదాపుగా ఆక్సిజన పడకలు ఫుల్ అయ్యాయి. గుంటూరు జీజీహెచ్లో 720 మంది కొవిడ్ బాధితులకు చికిత్స చేస్తుండగా 560మందికి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటయ్యాయి. విశాఖ కేజీహెచ్లో 1400మంది, అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో 622 మంది, ఒంగోలు రిమ్స్లోని 800 చికిత్స పొందుతున్నారు. ఇలా తెలుగురాష్ట్రాల్లోని మేజర్ ఆసుపత్రుల్లో చాలావరకు ఆక్సిజన్ బెడ్లు కూడా నిండిపోతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
Must Read ;- వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్ రైలు

అంత్యక్రియలకూ ఇబ్బందే..
ఇక తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కారణంగా చనిపోయినవారి అంత్యక్రియలకూ ఇబ్బందికర వాతావరణం నెలకొంది. సొంత ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవడం, కొన్ని శ్మశాన వాటికలకే మృతదేహాలు తరలిస్తుండడంతో అక్కడ రద్దీ పెరుగుతోంది. కొన్నిచోట్ల శ్మశాన వాటికల చుట్టుపక్కల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డ, బన్సీలాల్పేటలో ఎలక్ట్రికల్ క్రిమిటోరియాలున్నాయి. నిరంతరం రేయింబవళ్లు మృతదేహాల అంత్యక్రియలు చేస్తుండడంతో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర శ్మశాన వాటికల్లోనూ రద్దీ పెరుగుతోంది. ఇక తెలుగురాష్ట్రాల్లో గుంటూరులో మృతుల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. గుంటూరులోని బొంగరాలబీడు మహాప్రస్థానానికి గురువారం ఒక్కరోజే 53 మృతదేహాలకు ఈ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు రెండురోజుల వ్యవధిలో 92 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో కొవిడ్ మృతులు ఎంతమంది అనే అంశంపై సందేహాలున్నా.. ఈ స్థాయిలో మృతదేహాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోనూ ఇదే పరిస్థితి కొనిపిస్తోంది. బుధ,గురువారాల్లో దాదాపు 100మంది చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే కొన్ని శ్మశాన వాటికల్లోనే కొవిడ్ మృతుల అంత్యక్రియలకు అనుమతి ఉండడం కూడా కారణంగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో..
దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో గురువారం ఆక్సిజన్ అందకపోవడంతో 25మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లా ఆసుపత్రిలో పడకలు లేకపోవడంతో ఆసుపత్రి గేటుకి నోటీసు అంటించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అదే సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ కూడా రెండురోజులకు సరిపడా మాత్రమే అందుబాటులో ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. భోపాల్లోని బాద్భాద శ్మశాన వాటికలో సోమవారం 37 కరోనా మృతులకు అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరులో పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఒక్కో శ్మశాన వాటికలో 14 మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు సామర్థ్యం ఉండగా గత రెండుమూడురోజుల నుంచి ప్రతి శ్మశాన వాటికలో 40వరకు అంత్యక్రియలు (ఖననం లేదా దహనం) చేయాల్సి వస్తోంది. గత 24గంటలుగా పీణ్యా శ్మశాన వాటిక వద్ద 17 మృతదేహాలు, బొమ్మనహళ్లి కూడ్లు శ్మశాన వాటిక వద్ద 22, సుమనహళ్లిలో 26, మేడి అగ్రహారలో 18 మృతదేహాలతో బంధువులు పడిగాపులు కాస్తున్న వార్తలు వచ్చాయి. బెంగళూరు సమీపంలో తత్కాలిక శ్మశాన వాటిక కోసం దాదాపు 200 ఎకరాలను లీజుకు తీసుకున్న పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఏ శ్మశాన వాటిక వద్ద చూసినా 30 నుంచి 40 వరకు మృతదేహాలు ఉంటున్నట్లు స్థానిక మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. చత్తీస్ఘడ్లోనూ అదే పరిస్థితి. నాలుగు రోజులుగా మరణాల సంఖ్య పెరగడంతో ఫ్రీజర్లలో శవాలు పేరుకుపోయాయి. దుర్గ్లోని రెండు శ్మశాన వాటికలు సరిపోకపోవడంతో అదనపు తత్కాలిక వాటికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Must Read ;- ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్











