టీమిండియా విజయాల సారథి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ అకాడమీలు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులను సిద్ధం చేసేందుకు ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ)ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎంఎస్డీసీఏల వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. ఈ మేరకు వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్లు శుక్రవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బ్రెనియాక్స్ బీ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంఎస్డీసీఏలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

తెలంగాణలో 15 అకాడమీలు: వినోద్ కుమార్
ధోని మార్గనిర్దేశనంలోని క్రికెట్ అకాడమీలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్కా స్పోర్ట్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని బ్రెనియాక్స్ బీ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణలో 15 ప్రాంతాల్లో ఈ అకాడమీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కలిపి మరో 25 అకాడమీల వరకు నెలకొల్పుతామని చెప్పారు. భారత్లో వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్ (యూఏఈ), దోహా (ఖతార్)లో ధోని క్రికెట్ అకాడమీలున్నాయి.
కోచింగ్ డైరెక్టర్గా డారెల్ కలీనన్..
అకాడమీ కోచింగ్ డైరెక్టర్గా సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ డారెల్ కలీనన్ కొనసాగుతారని ఆర్కా స్పోర్ట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, భారత మాజీ అండర్-19 ప్రపంచ కప్ జట్టు సభ్యుడు మిహిర్ దివాకర్ తెలిపారు. తమ సంస్థకు చెందిన మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్లో బళ్లారిలో ప్రారంభం కానుందన్నారు. ఇప్పటికే భారత్లో 50కి పైగా కేంద్రాలు, విదేశాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.
ధోని త్వరలో విద్యారంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారని, ఈ ఏడాది జూన్ నుంచి బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్ ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు.
Must Read ;- చిరకాల స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ వివాహం










