లోక్సభ బడ్జెట్ సందర్భంగా టీమిండియా ప్రస్తావన వచ్చింది. ఆస్ట్రేలియాలో టీమిండియా స్ఫూర్తిదాయక విజయం గురించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. “క్రికెట్ను ఎంతగానో అభిమానించే దేశం భారత్. ఇటీవలే ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన తర్వాత మనం పొందిన అనుభూతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. ఆ విక్టరీ ప్రజలకే కాదు ముఖ్యంగా యువతలోనూ ఎంతగానో స్ఫూర్తిని నింపింది. క్లిష్ట పరిస్థితుల్లో ముందుకెలా సాగాలనే దానికి ఓ ఉదాహరణగా మిగిలింది. ఓటమి తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసి గెలవాలన్న కాంక్షను రగిలించింది” అని సీతారామన్ అన్నారు.
ఆటకు మొండిచేయి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి మొండిచేయి లభించింది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది. గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం… భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా… క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం పెద్దమొత్తంలో కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్లో క్రీడారంగానికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.
మోదీ ప్రశంసలు..
మన్ కీ బాత్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గబ్బాలో చారిత్రక విజయాన్ని నమోదు చేయడంపై భారత జట్టు ప్రతిభను కొనియాడారు. ‘ ఈ నెలలో మనకు క్రికెట్ ఒక శుభవార్త అందించింది. ఆసీస్ గడ్డపై ఆదిలో భారత జట్టు ఒడిదొడుకలకు లోనైనా.. చివరలో మాత్రం టెస్టు సిరీస్లో అదరగొట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. మన జట్టు కృషి, సమిష్టి పోరాటం అందరికి స్పూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.
Must Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్