గత ఏడాది ఈ సమయానికి అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగం పొంగి పొరలుతూ ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అన్నాచెల్లెళ్లు ఒకరి మొహం ఒకరు చూసుకుని చాలా కాలం గడచిపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి సవాళ్ల వరకు వెళ్లాయనే గుసగుసలు ప్రజల్లో వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అన్నాచెల్లెలూ చాలా కాలం తర్వాత పరస్పరం ఎదురుపడ్డారు. అయితే మరిన్ని పుకార్లకు ప్రాణం పోసేలా.. వారిద్దరూ చాలా ముభావంగా మాత్రమే మాట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు చాలా ముక్తసరిగా వ్యవహరించారు. ఈ పరిస్థితికి ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి ప్రాంగణం వేదిక అయింది. వర్ధంతి సందర్భంగా తండ్రికి నివాళులు అర్పించడమే సందర్భం అయింది. గురువారం నాడు వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా జగన్, షర్మిల ఇడుపులపాయకు ఒకే సమయంలో వచ్చారు.
వదిలించుకుంటే.. దెబ్బ కొట్టారా?
అన్న జగన్ తో షర్మిల విభేదిస్తున్నట్లుగా, ఆయన తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లు షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాను కొత్తగా అడుగులు వేస్తూ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆమె పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని … జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన అనుయాయులు తీవ్రంగా ఖండించారు. అంటే.. జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా చెల్లెలు షర్మిలను వదిలించుకున్నట్టేనా అనే సంకేతాలు వచ్చాయి. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత.. అసలైన రాజన్న రాజ్యం ఇక్కడి ప్రజలకు చూపిస్తానన్న షర్మిల ఆ మాట ద్వారా పరోక్షంగా జగన్ చెప్పుకుంటున్న రాజన్న రాజ్యం అనే మాటను దెప్పిపొడిచినట్లు అయింది.
విభేదాలు చిన్నవేమీ కానట్టే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి.. చెల్లెలు షర్మిల ఎన్ని త్యాగాలు చేశారో, ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. జగన్ జైల్లో ఉన్న రోజుల్లో పార్టీ కట్టు తప్పిపోకుండా.. షర్మిల చేసిన పాదయాత్ర పార్టీకి ప్రాణం నిలబెట్టింది. 2014లో మాత్రమే కాదు, 2019 ఎన్నికల్లో కూడా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత చేసినా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కరివేపాకులా పక్కన పెట్టిందనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఆమె సొంత కుంపటి పెట్టుకున్నారు. జగన్ తో అదివరలో ఎంతో ప్రేమాస్పదంగా ఉండే షర్మిల.. ఇటీవలి కాలంలో అంటీముట్టనట్టుగా ఉన్నారు. కనీసం రక్షాబంధన్ నాడు జగన్ కు రాఖీ కూడా కట్టలేదు. వైఎస్సార్ జయంతి నాడు.. జగన్ లేని సమయంలో ఆమె ఇడుపులపాయలో తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిపోయారు. చాలాకాలంగా అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు ఎదురుపడనేలేదు. అయితే వర్ధంతి నాడు.. ఎదురుపడ్డారు. అయినా సరే అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ముభావంగా వ్యవహరించారు. పెద్దగా పలకరించుకోలేదు. తండ్రి సమాధి వద్ద ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నా మధ్యలో చాలా దూరం ఉండేలా చూసుకున్నారు. చూడబోతే ఇద్దరి మధ్య విభేదాలు కాస్త ఎక్కువ మోతాదులోనే ఉన్నట్టుందని అంతా అనుకోవడం విశేషం.
Must Read ;- ముగ్గురు వస్తే.. ఒక్కొక్కరూ ఒక్కో వెరైటీ











