మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు. ఆయన నిన్న రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా, బీజేపీలో చేరిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక లాంటి కీలక అంశాలను చర్చించినట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఈటల రాజేందర్ ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన తర్వాత, అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖను అందించనున్నారు. ఈ నెల 14న బీజేపీలో చేరిక దాదాపు ఖాయం కావడంతో ప్రత్యేక విమానంలోఢిల్లీ వెళ్లనున్నారు. ఈటల తోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమతో, మరికొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Must Read ;- హుజూరాబాద్లో ఈటల ఓడిపోవడం ఖాయం: గుత్తా










