Four Telugu Teachers Selected For National Best Teacher Award 2021 :
విద్యా బోధనలో తెలుగు ఉపాధ్యాయులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా విద్యా బోధనలో మెరుగ్గా రాణిస్తున్న ఉపాధ్యాయులను గుర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2021 ఏడాదికి సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు బుధవారం ప్రకటించింది. ఈ దఫా ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న 44 మందిని ఎంపిక చేసింది. ఈ 44 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు ఏకంగా నలుగురు చోటు సంపాదించారు. ఈ నలుగురిలో ఇద్దరు ఏపీకి చెందిన వారైతే.. మరో ఇద్దరు తెలంగాణకు చెందినవారు.
తెలుగు అవార్డీలు వీరే
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 44 మంది జాబితాలో ఏపీకి చెందిన వారు ఇద్దరున్నారు. వీరిలో ఏపీలోని విశాఖ జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఐరాల పాయిపల్లి హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మునిరెడ్డి ఉన్నారు. ఇక తెలంగాణకు చెందిన ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయుల విషయానికి వస్తే.. ఆసిఫాబాద్ జిల్లా సావర్ ఖేడ్ ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్న రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ లో ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్న రామస్వామి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
Must Read ;- విశాఖ ఉక్కు టాటాల చేతుల్లోకి!