వంట గ్యాస్, పెట్రోలు ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు వీటిపై పెంపు సాధారణమే అయినా… చమురు ధరలు తగ్గితే మాత్రం గ్యాస్ గానీ, పెట్రోల్ ధరలు కూడా తగ్గడం లేదు. అంతే కాకుండా గ్యాస్ ధరలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం ఎల్పీజీ సిలిండర్పై రూ.50 పెంచిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు… తాజాగా మరో రూ.50 పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వెరసి 15 రోజుల వ్యవధిలోనే వంట గ్యాస్ సిలిండర్పై ఏకంగా రూ.100 పెరిగినట్టయ్యింది. మొత్తంగా గృహ వినియోగదారుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ధర పెరిగిన క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నిత్యం పెరుగుతున్నాయే తప్పించి తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. వెరసి వినియోగదారుల నడ్డి విరుగుతోంది.
గ్యాస్ ధరలు ఇలా..
ఎల్పీజీ సిలిండర్ ధరలు మంగళవారం మరోమారు పెరిగాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. 5 కిలోల చిన్న సిలిండర్ ధర రూ.18, 19 కిలోల వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.36.50 పెరిగింది. దీంతో ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ గ్యాస్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694లకు చేరుకోగా… కోల్కతాలో రూ.720.50, ముంబైలో రూ.694, చెన్నైలో రూ.660కి పెరిగాయి. పెరగడానికి ముందు ఢిల్లీలో రూ.594, కోల్కతాలో రూ.620.50, ముంబైలో రూ.594, చెన్నైలో రూ.610గా ఉండేది. ఇప్పుడు రూ.50 చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడల్లో గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.696.50, రూ.854కు చేరుకున్నాయి.
Must Read ;- ఒకే నెలలో వంద పెరిగిన గ్యాస్ ధర
ప్రభుత్వరంగ కంపెనీలే..
ప్రభుత్వరంగ కంపెనీలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లే ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేవలం 15రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రెండోసారి పెరగడం గమనార్హం. డిసెంబర్ 2న గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరగగా… తాజాగా మంగళవారం మరో రూ.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ బండ ధర ఏకంగా రూ.100 పెరిగినట్టైంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.54.50 పెరిగి ఢిల్లీలో రూ.1,296కు చేరుకుంది. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందిస్తుంది. కొనుగోలు సమయంలో పూర్తిగా మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీపై అందుతాయి. అంతకు మించితే మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాలి.
ముడి చమురు ధరలు తగ్గినా..
అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సాధారణమే అయినా… అంతర్జాతీయంగా చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ… మన చమురు సంస్థలు గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించకపోగా… వాటిని పెంచుతూ పోతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రజల ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని చమురు సంస్థలు ఎడాపెడా ధరలను పెంచుకుంటూ పోతుండగా… ఆ సంస్థలను కంట్రోల్ చేయాల్సిన గురుతర బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read ;- టీకా పంపిణీకి కేంద్రం, రాష్ట్రాల అత్యవసర ఏర్పాట్లు