నలభయ్యేళ్లు దాటిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో స్పీకరు పోడియం వద్దకు దూసుకెళ్లి అక్కడ బైఠాయించే పరిస్థితి ఎందుకు వచ్చిందో.. సస్పెండ్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. నివర్ తుపాను రైతుల జీవితాల్ని కబళించేస్తే.. పంట బీమా ప్రీమియంలు కూడా చెల్లించకుండా దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం.. రైతుల్ని మోసం చేసిందనే డిమాండ్ మీద తమ గళం వినిపిస్తున్న సందర్భంగానే అదంతా జరిగింది.
ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని ది లియోన్యూస్ డాట్ కామ్ అయిదు రోజుల కిందటే ఓ కథనం అందించింది. నివర్ నష్టం అనంతం.. పంటల బీమా పచ్చి మోసం శీర్షికతో ఈ కథనం అందించడం జరిగింది.
అయితే చంద్రబాబునాయుడు.. ప్రీమియం చెల్లించకుండా మోసం చేశారనే విషయాన్ని బహిరంగ పరచిన తర్వాత.. జగన్ సర్కారు మేలుకుంది. పంటల బీమా ప్రీమియం కింద రూ. 590 కోట్లు విడుదల చేస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలు తెలుగుదేశం నిన్నే మీడియాకు విడుదల చేసింది. 2019లో ఎలాంటి క్లైములూ లేవని.. పరిహారం లెక్కల గణింపు జరుగుతోందని ఆర్టీఐ దరఖాస్తుకు వ్యవసాయ శాఖ సమాచారమిచ్చింది. 2014 నుంచి 2019 వరకు పంటల బీమా క్లైములకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వచ్చిన
లెక్కలను నిన్ననే చంద్రబాబునాయుడు మీడియాకు విడుదల చేశారు. పంటల బీమా ప్రీమియం ఇంతవరకు చెల్లించలేదని నిన్న శాసనసభ లో టీడీపీ నిరసన వెలిబుచ్చింది. రైతుల్ని మోసం చేస్తూ తప్పుడు లెక్కలు చెప్తోందని స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఈ గొడవలోనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత.. చంద్రబాబునాయుడు అసెంబ్లీ బయటకు వచ్చి.. తాను రైతులకోసమే పోరాడుతున్నానంటూ.. గేటు వద్ద పోలీసులతో కూడా తన ఆవేదన వెలిబుచ్చారు.
అర్ధరాత్రి.. పంటల బీమా ప్రీమియం కింద రాష్ట్ర వాటా కింద రూ.590కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఖరీఫ్ 2019 క్లైముల నిమిత్తం ఈ చెల్లింపులు ప్రీమియంగా విడుదల చేశారు.
ఇది అర్ధరాత్రి ప్రభుత్వమా..
ఇది చీకటి ప్రభుత్వమా.. అర్ధరాత్రి పాలన సాగించే ప్రభుత్వమా అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. చంద్రబాబునాయుడు అంత ఘాటుగా నిలదీయడం వల్లే ప్రభుత్వంలో చలనం వచ్చి కనీసం ప్రీమియం విడుదల చేశారని, గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఉత్తర్వులు విడుదల చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎలా బుకాయించినా.. ప్రభుత్వ వంచన ను రైతులు గుర్తిస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వం కార్యకలాపాలన్నీ అర్ధరాత్రే జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి జీవోలు రావడం ఇది తొలిసారి కాదు. అలాగే.. తెలుగుదేశానికి చెందిన నాయకుల ఆస్తులను, భవనాలను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే మిష మీద నోటీసులు లేకుండానే.. కూల్చివేతలు ప్రారంభించడం అన్నీ కూడా అర్ధరాత్రి వేళల్లోనే సాగిస్తున్నారు. ఇలాంటి తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి.
Also Read: జగన్ కేసుల్లో నిమ్మగడ్డకు కొంత ఊరట











