హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా ఏ ఒక్క పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అయినా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడకుండానే.. పార్టీలు అభ్యర్థులను ఎందుకు ప్రకటిస్తాయి? అంటారా? ఆ మాటే నిజమైతే.. మరి దాదాపుగా అన్ని పార్టీలు.. వైరి శిబిరంలో ఉన్న కీలక నేతలకు ఎందుకు గేలం వేస్తున్నట్లు? ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థి లేడన్న భావనతోనే అన్ని పార్టీలు ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతల వైపు దృష్టి సారిస్తున్నాయన్న ఈక్వేషన్లు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యాక గానీ.. అధికార టీఆర్ఎస్ తో పాటు అక్కడ ఉప ఎన్నికకు అనివార్యం చేసిన ఈటల రాజేందర్కు కండువా కప్పిన బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తాయన్న మాట. అప్పటిదాకా కొత్త నేత ఎవరు వచ్చిన ఏ పార్టీలో చేరినా.. ఆ నేతే ఆ పార్టీ తరఫున హుజూరాబాద్ అభ్యర్థి అంటూ ప్రచారం సాగిపోవడం ఖాయమన్న మాట. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే ఒకటి వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించిన స్వర్గం రవి.. హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎవరీ స్వర్గం రవి?
స్వర్గం రవి వివరాల్లోకి వెళితే.. గత 15 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో తెలంగాణ పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. పారిశ్రామికవేత్త కూడా అయిన స్వర్గం రవి హుజూరాబాద్ లో తనకంటూ సొంత కేడర్ను ఏర్పరుచుకోగలిగారు. రవి రాజీనామాతో ఆయన కేడర్ అంతా టీఆర్ఎస్లోకే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ డ్యామేజ్ తప్పదనే చెప్పాలి. మరోవైపు స్వర్గం రవికి టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం.. స్థానికంగా పట్టు ఉండటంతో కేసీఆర్ స్వర్గం రవికి టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలే స్వర్గం రవిని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిపించుకుని మాట్లాడారన్న ప్రచారం ఉంది. టికెట్ విషయమై చర్చించేందుకే ఆయన్ను ప్రగతి భవన్కు పిలిపించి ఉండవచ్చునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి పాడి కథేంటి?
ఇదే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వర్గం రవి కూడా టీఆర్ఎస్లో చేరబోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరికి కేసీఆర్ టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ముద్దసాని పురుషోత్తం రెడ్డి,ముద్దసాని మాలతి,గెల్లు శ్రీనివాస్ యాదవ్,కౌశిక్ రెడ్డి తదితరుల పేర్లను పరిశీలించిన కేసీఆర్ స్వర్గం రవి వైపే మొగ్గుచూపుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ జరిపించిన సర్వేలు,ఇంటలిజెన్స్ రిపోర్టుల్లో మిగతావారి కంటే స్వర్గం రవి పట్ల సానుకూలత ఎక్కువగా ఉండటంతో గులాబీ బాస్ ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Must Read ;- అక్కడ టీఆర్ఎస్ ఓడితే!.. దళిత బంధు ఆగినట్టే!











