మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నకొద్దీ విజయవాడ టీడీపీలో గ్రూపుల గొడవలు రచ్చ కెక్కుతున్నాయి. ఈ రోజు ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులంటే ఇష్టమని, ఎవరైనా తన వెనుక రావాల్సిందే గాని.. తాను ఎవరి వెనుక వెళ్లనని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన సామంతులు పార్టీకీ నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా అని అంటూ వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్నారు. ముస్లిం సోదరుల కోసం చంద్రబాబుని కూడ కాదని నిలబడ్డానని పేర్కొన్నారు. తాను. తన అమ్మాయి మేయర్ పదవి కోసం పాటు పడటం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నామని అన్నారు.
శ్వేతను మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారనే..
కాగా, ఎంపీ తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారనే ఆ పదవిపై కన్నేసిన వారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఉంచినా చెమటలు చిందించి గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెబుతున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కేశినేని వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు. 2014లో కూడా విజయవాడ మేయర్ పదవి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారని, ఈ సారి వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈ ముగ్గురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంటే కమ్మ సామాజికవర్గం కాకుండా అంటే కాపు, బ్రాహ్మణ, ముస్లిం ఈ మూడు వర్గాల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చారు.
కేశినేని గరం గరం
మేయర్ ఎన్నికలు వచ్చే నెల 14న జరగనున్న నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేశినేని కూతురు శ్వేతను మేయర్ను చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. కేశినేని ప్రచారంలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ ఎవరూ పాల్గొనడం లేదు. అలాగని వారూ కూడా ఇంకా ప్రచారంలోకి దిగలేదు. టీడీపీలో రెండు గ్రూపుల గొడవతో ఎన్నికల తరవాత మేయర్ ఎవరనేది తేల్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి వారే విమర్శలతో టీడీపీ పరువు బజారున పడేస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఎన్నార్సీకి అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబు కోరినా, తాను వేయలేదని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. దీంతో కేశినేని నాని కూతురుకు కాకుండా మరెవరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా కేశినేని పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- సీటు కోసం సిగపట్లు.. టీడీపీలో విజయవాడ మేయర్ పంచాయితీ!

ఇరకాటంలో చంద్రబాబు
విజయవాడలో ప్రధానంగా 4 సామాజికవర్గాలు ఉన్నాయి. కమ్మ,కాపు,ముస్లిం, బ్రాహ్మణవర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. కేశినేని నాని కూతురుకు మేయర్ అభ్యర్థిగా ఇస్తే మరో మూడు సామాజికవర్గాలు దూరం అవుతాయని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ చెప్పకనే చెపుతున్నారు. అంటే కేశినేని నాని కూతురు మేయర్ అభ్యర్థి అని ఎన్నికలకు ముందే ప్రకటిస్తే ఆ ముగ్గురూ పార్టీ కోసం పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గం అభ్యర్థిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూనే, పార్టీ అధినేత ఎవరిని పెట్టినా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతామంటున్నారు. వారి మనసులోని మాట చెబుతూ, పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తూనే టీడీపీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, చంద్రబాబు వీరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎంపీ కేశినాని నానికి అయితే చంద్రబాబు చెప్పే పరిస్థితి కూడా లేదని తెలుస్తోంది. అలాగని ఆ ముగ్గురు నేతలు విజయవాడలో టీడీపీని గట్టెక్కిస్తారా? అంటే? వారికి అంత సీన్ కనిపించడం లేదు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు అయ్యే వరకు మేయర్ అభ్యర్థి ఎవరో తేల్చకుండా, తరవాత వచ్చే మెజారిటీని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
గెలికితే ఏదో ఒక పదవి హామీ ఇవ్వకపోతారా?
బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక బోండా ఉమను పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. నాగుల్ మీరా విజయవాడ ఓల్డు సిటీలో కొంత వరకు ప్రభావం చూపగలరు. ఇప్పుడే ఏదో ఒక మెలిక పెడితే, భవిష్యత్తులో ఏదో ఒక పదవి ఇచ్చే ఆఫర్ చేస్తారని ఆయన భావిస్తున్నారు. గతంలోనే నాగుల్ మీరా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఎవరికైనా పదవి ఇస్తే వెంటనే మైనార్టీ కార్డు తెరమీదకు తీసుకువస్తాడు. ఇలా టీడీపీ హయాంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ పదవి సాధించుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే సూత్రం అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. విజయవాడలో టీడీపీ మేయర్ సీటు కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉండటంతో ఇప్పటి నుంచే లొల్లిపెడితే తమ వారికి మేయర్ పదవి కాకపోయినా డిప్యూటీ మేయర్ పదవి అయినా వస్తుందనే ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఎన్నికలు కొద్ది రోజుల్లో పెట్టుకుని టీడీపీ నేతలు రోడ్డున పడి విమర్శించుకోవడం పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
Also Read ;- మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్.. జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు











