(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తనకి అత్యంత సమీప బంధువు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు ప్రత్యామ్నాయంగా బొత్స సోదరుడు లక్ష్మణరావు తన కుమారుడు చైతన్యను రాజకీయ రంగంలోకి దింపారు. చైతన్యను బొత్స సత్యనారాయణ తన వెంట తిప్పుతూ నెల్లిమర్ల వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేస్తుండటాన్ని బడ్డుకొండ జీర్ణించుకోలేక పోతున్నారని వినికిడి.
తన సమీప బంధువు బడ్డుకొండ కోసం గత ఎన్నికల్లో తన రాజకీయ గురువైన పెనుమత్స సాంబశివరాజుకు బొత్స చెక్ పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తన రాజకీయ వారసుడు చైతన్య కోసం సమీప బంధువు బడ్డుకొండను పక్కకు తప్పించడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడక పోవచ్చనే వదంతులు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో బడ్డుకొండ అప్పలనాయుడు గెలవడానికి కీలకపాత్ర వహించిన లక్ష్మణరావు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు చైతన్యను బరిలో దింపాలని పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా బొత్స రాజకీయ వారసునిగా చైతన్యను తీర్చిదిద్దేందుకు వారి కుటుంబ సభ్యులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘తాను జగన్ కే బద్ధుణ్ణి కానీ వేరే ఎవరికీ కాదని’ తాజాగా బడ్డుకొండ ప్రకటించడం కూడా వీరి కుటుంబంలో ముసలం పుట్టిందనే వాదనలను బలపరుస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.
వైసీపీ క్లీన్ స్వీప్ లో బొత్స పాత్ర
గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు వైసీపీ పరం అయ్యాయి. ఇలా జరగడానికి జగన్ ప్రభంజనం అతి ముఖ్య కారణమైనప్పటికీ, అందులో బొత్స పాత్ర కూడా ఎనలేనిదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో జగన్ అయిదు నెలల పాటు పాదయాత్ర చేశారు. ఇందులో రెండు నెలలు విజయనగరంలోనే ఆయన పాదయాత్ర సాగింది. అణువణువూ జగన్ కలియతిరిగి జనాల హృదయాలను దోచుకున్నారు. దాని ఫలితమే ఈ సునామీ అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే స్థాయిలో తాము కూడా కష్టపడ్డామని , తమ వల్లనే ఈ విజయం సాధ్యపడిందని మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం చెబుతోంది. తాము జిల్లాలో గట్టిగా నిలబడబట్టే వైసీపీకి ఇంతటి భారీ మెజారిటీ వచ్చిందని, జిల్లా మొత్తం వైసీపీ పరం అయిందని ఢంకా బజాయిస్తున్నారు. దానికి తోడు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో సగానికి పైగా బొత్స సత్యనారాయణ వర్గం కావడంతో మంత్రి గారి హవా మామూలుగా లేదనే చెప్పొచ్చు. జగన్ సైతం బొత్స కోరినట్లుగా టికెట్లు ఇచ్చేశారని, అదే ఇపుడు వైసీపీలో పెద్ద చిచ్చుని రేపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికారంలో బొత్స ఫ్యామిలీయే
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మొత్తం ఫ్యామిలీ అధికారంలో ఉంది. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా బొత్స ఉన్నారు. ఆయన సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు అత్యంత సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్సకు సన్నిహితుడు కడుబండి శ్రీనివాసరావు ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగాను, బొబ్బిలిలో మరో సన్నిహితుడైన శంబంగి చిన అప్పలనాయుడు ఎమ్మెల్యేగాను ఉన్నారు. పార్వతీపురంలో కూడా తనకు అనుకూలమైన వ్యక్తి శంబంగి జోగారావుకు బొత్స టికెట్ ఇప్పించుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. బొత్సకు అత్యంత సన్నిహితుడు బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం ఎంపీగా ఉన్నారు. ఇలా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ముగ్గురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా బొత్స వర్గమే అనేది నిర్వివాదాంశం.
బొత్స కూటమిలో సంక్షోభం
అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోను తిరుగులేని నాయకుడుగా చెలామణి అవుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ వర్గంలోనే రాజకీయ సంక్షోభం మొదలైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకే ఏకంగా ఎసరు పెట్టేలా ఆపరేషన్ మొదలెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బొత్స సోదరుడు లక్ష్మణరావు నెల్లిమర్లలో తన హవా చాటుతున్నారు. తనను కాదని ఏ పనీ ఎమ్మెల్యే చేయడానికి వీలులేదని కూడా ఆదేశాలు ఇస్తున్నారని తెలుస్తోంది. బడ్డుకొండ గెలుపులో లక్ష్మణరావు పాత్ర ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేనే కాదంటే ఎలా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్యన విభేదాలు ముదిరి పాకాన పడ్డాయని వారే బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. దీని పర్యవసానంగానే.. లక్ష్మణరావు తన కుమారుడు చైతన్యను రాజకీయ రంగంలోకి దించారని టాక్.
2024లో తన కుమారుడికే నెల్లిమర్ల టికెట్ అంటూ అపుడే ప్రచారం మొదలెట్టేశారని వినికిడి. బొత్స సత్యనారాయణ సైతం సోదరుడి కుమారుడితోనే నెల్లిమర్లలో సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఈ వదంతులు మరింత బలపడుతున్నాయి. మొత్తానికి బొత్స వర్సెస్ బడ్డుకొండగా నెల్లిమర్ల రాజకీయాలు తయారయ్యాయనేది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నెల్లిమర్లలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read: వైసీపీ, బీజేపీ నాయకుల మాటల యుద్ధం.. రగులుతున్న పార్వతీపురం