పేదలకు రూపాయికే ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ చూసి వైసీపీ మంత్రులకు నోట మాట రావడం లేదట. రాబోయే 3 సంవత్సరాల్లో రూ.28 వేల కోట్ల ఖర్చుతో 30 లక్షల ఇళ్లు నిర్మించి, రూపాయికే పేదలకు ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది ఎలా సాధ్యమా అని కొందరు మంత్రులకు ఎంత ఆలోచించినా విషయం బోధ పడలేదట. తాజాగా ఏపీ సీఎం లక్షా 80 వేలతో ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పడంతో మంత్రులకు విషయం అర్థం అయిందట. పేదలకు నిర్మించే 30 లక్షల ఇళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదట. కేంద్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాలకు ఒక్కో ఇంటికి లక్షన్నర సహాయం చేస్తోంది. దీనికి అదనంగా జగనన్న ఇసుక ఇస్తాడట, ఇక అంతే కేంద్ర సాయం చేసే మొత్తంతో పేదవాడి ఇంటి కలను నెరవేరుస్తారట.
రూ.7.5 లక్షలు ఎటుపోయాయి
పేదలకు రూ.7.5 లక్షల ఖర్చుతో ఇంటిని నిర్మించి రూపాయికే ఇస్తామని చెప్పడంతో చాలా మంది నిజమేనని భ్రమపడ్డారు. పేదల ఇంటి నిర్మాణానికి కేంద్రం లక్షన్నర ఇస్తే మిగిలిన ఆరు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని భావించారు. తాజాగా ముఖ్యమంత్రి ప్రకటన చూసి వైసీపీ నేతలకే నోట మాటరావడం లేదట. కేవలం కేంద్రం ఇచ్చే నిధులతోనే 30 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు రూ.7.5 లక్షల విలువైన ఇంటిని జగనన్న ఇస్తాడని మంత్రులు కొందరు జోక్ లు వేసుకుంటున్నారట. 30 లక్షల ఇళ్ల నిర్మాణాలకు జగనన్న రూ.28 వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా… అని తెగ మధనపడవపోయిన మంత్రులు తాజా ప్రకటనతో కోలుకున్నారట.
ప్రభుత్వ స్థలమే ఆరులక్షలు
ప్రభుత్వం అభివృద్ధి చేసిన సెంటు భూమి ఇస్తుందని దాని విలువే ఆరు లక్షలు అవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారట. కేవలం సెంటు భూమి ఇవ్వడమే కాదు, సిమెంటు రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్, వీధిదీపాలు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం పెట్టుకుంటుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఉపాధి హామీ పథకంలో భాగంగా 17 వేల కాలనీల్లో సిమెంటు రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నా, ప్రభుత్వానికి ఒక్క రూపాయి భారం పడకుండా జగనన్న వేసిన స్కెచ్ అదిరిపోయిందని మంత్రులు తెగ సంబరపడిపోతున్నారట.
మొదటి విడత 12 లక్షలు
డిసెంబరు 25న 12 లక్షల పేదల గృహాలకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడత 12 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు రూపాయికే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇవి సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల నాటికి మరో 18 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది. ఎన్ని నగదు బదిలీ నవరత్నాల పథకాలు ఉన్నా, పేదలకు రూపాయికే దక్కేలా 30 లక్షల ఇళ్లు, వచ్చే ఎన్నికల్లో గట్టెకించే పథకంగా వైసీపీ అధినేత అంచనాగా ఉందట. చూద్దాం… పేదలకు ఉచితంగా ఇళ్లు సమకూరితే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి.
Must Read ;- నెల్లూరు పెద్దారెడ్లతో పెట్టుకుంటే అంతే.. వైసీపీలో మంత్రి అనిల్ సైలెంట్