ఏపీ రాజకీయవర్గాల్లో రెండు మూడు రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీలో చర్చలు నడుస్తున్నాయనే అంశంపైనే ఈ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేనకు పదవి ఇవ్వడం ద్వారా రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయని, పవన్ కల్యాణ్కు పదవి ఇవ్వడంతో బీజేపీకి కొత్త ఓటు బ్యాంకు ఏర్పాటవుతుందని పార్టీ భావిస్తున్నట్టు ఆ చర్చల సారాంశంగా ఉంది. అదే సమయంలో చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ పదవి ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఈ అంశాలపై ఆయా వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రానప్పటికీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
పవన్ కల్యాణ్కు పదవి ఇస్తే..
ఆ చర్చల ప్రకారం..రానున్న కాలంలో ఏపీలో ఒంటరిగా పోటీచేసినా, ప్రస్తుత యథాతథ స్థితి కొనసాగించి బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం బీజేపీ ముఖ్య నాయకులకు ఉంది. పార్టీలోకి ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినంత మాత్రాన అది ఓట్లను ప్రభావితం చేయలేదని, పవన్ కల్యాణ్కు ఉన్న ఛరిష్మాను వినియోగించుకుంటే పార్టీకి కలిసొస్తుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్కు పదవి ఇస్తే సామాజికంగా కూడా బీజేపీకి ఉపయోగం ఉంటుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీకి చెందిన నాయకులెవరూ కేంద్ర మంత్రివర్గంలో లేరు. ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీతో పాటు అధికారం కూడా ఉండాలని, అప్పుడే ప్రజలకు దగ్గర కావచ్చనే అభిప్రాయం ఉంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, సమీప కాలంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు అవసరమని పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి సురేష్ ప్రభు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన జీవీఎల్ యూపీ కోటాలో ఎన్నికయ్యారు. ఏపీ నుంచి బీజేపీకి లోక్సభ సభ్యులు లేకపోవడం, ఇటీవల పార్టీ నేతల దూకుడు తగ్గిన నేపథ్యంలో తక్షణ చర్యలు అవసరమని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నా వారు టీడీపీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని, అందులో భాగంగా పవన్ కల్యాణ్కు కేంద్ర మంత్రి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవికి ఎంపీ పదవిపై చర్చ..
కాగా మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్టు కూడా చర్చ నడస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా సమయం ఉండడంతో పాటు గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపలేదని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే రానున్న కాలంలో పవన్ కల్యాణ్కు చెక్ పెట్టేందుకు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. కాగా చిరంజీవికి, పవన్ కల్యాణ్కి రాజ్యసభ సీట్లు ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనే అంశానికి సంబంధించి పార్టీల నుంచి గాని, చిరంజీవిక, పవన్ కల్యాణ్ల నుంచి గాని క్లారిటీ రావాల్సి ఉంది.
Must Read ;- పైన పవర్ ఉన్నా లోకల్ టాలెంట్ నిల్.. టర్నింగ్లతో ఏపీలో కమలం బర్నింగ్











