ముందు ఒకడిని అవుట్ చేద్దాం.. తర్వాత వీడి సంగతి చూద్దాం అనుకున్నారు. వాడిని అవుట్ చేయడానికి వీడికి ఫుల్లు హెల్ప్ చేశారు. అనుకున్నట్లే వాడు అవుటయ్యాడు. వీడు మాత్రం ఎంతకూ అవుట్ అవ్వడం లేదు సరికదా..మనల్నే అవుట్ చేసేలా ఉన్నాడురా బాబూ అని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. పైన పవర్ ఉన్నా..లోకల్ ట్యాలెంట్ లేకపోవడంతో.. డీలాపడిపోతున్నారు. అప్పటికే ఓ స్టార్ని తెచ్చి తగిలించుకున్నారు. అయినా ప్రయోజనం కనపడటం లేదు. అవుట్ అయినోడిని దగ్గరకే రానివ్వలేదు. కాని ఇప్పుడు పరిస్ధితులు మారుతున్నాయి..ఈ పరిస్ధితులు వాళ్లు ఊహించలేదు. అందుకే ముందు రాసుకున్న సిలబస్ మార్చుకోవడం బెటరని పై నుంచి చెబుతున్నా… కాదు కూడదంటూ ఇక్కడి నేతలు మారాం చేస్తున్నారు. కమలం కథ టర్నింగులు మీద టర్నింగులతో బర్నింగ్ అయిపోతోంది ఏపీలో.
చంద్రబాబును ఓడించటం కోసం..
చంద్రబాబును ఓడించటం కోసం జగన్కు బ్యాక్ ఇచ్చారు. జగన్ను మెల్లగా వంగబెట్టొచ్చనుకున్నారు..కాని అది అయ్యే పనిలా కనపడటం లేదు. జగన్ తెలివిగా తాను చేసే ప్రతి పనికి కమలం స్టాంప్ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చేస్తున్నారు. దీంతో వైసీపీ చేస్తున్న పనుల వెనక బిజెపి సపోర్టు కూడా ఉందనే అందరూ అనుకుంటున్నారు. లేకపోతే వీళ్లింత ధైర్యంగా బరితెగిస్తారా అనే ప్రశ్నకూడా వస్తోంది. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో కూడా బిజెపికి తెలియకుండా ఏదీ జరగలేదనే ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు. వైసీపీపై వ్యతిరేకత తెచ్చి పెట్టే ప్రతి వ్యవహారంలోనూ బిజెపికి అడక్కుండానే వాటా ఇచ్చేస్తున్నారు వైసీపీ వాళ్లు. దీంతో కమలం ఇరుక్కుపోతోంది. టీడీపీతో కలిసే పని లేదని పదే పదే ఢంకా బజాయిస్తున్నారు కమలనాథులు. కాని మొన్నటి మహానాడులో టీడీపీ బిజెపికి మద్దతివ్వడానికి సిద్ధమని.. కలిసి పని చేసేందుకు సిద్ధమని ఓపెన్ గానే చెప్పేసింది. అటు నుంచి ఏమీ లేకుండా చంద్రబాబు ఇలా బయటపడరని టీడీపీ నేతలు అంటున్నారు.
Must Read ;- కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు
దేశంలో రోజురోజుకు బలహీనపడుతున్న బిజెపి
అసలు కథ ఏంటంటే… బిజెపి దేశంలో రోజురోజుకు బలహీనపడుతోంది. మోదీ ఇమేజ్ మసకబారుతోంది. దీంతో బిజెపి మళ్లీ మిత్రత్వ పార్టీలను పెంచుకోవాల్సిన పరిస్ధితి వస్తోంది. అందుకే ఎవరినీ వదులుకోదల్చుకోవడం లేదు. అటు వైసీపీని, ఇటు టీడీపీని రెండిటిని వాడుకోవాల్సిన పరిస్ధితి వస్తుందని బిజెపి కేంద్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే టీడీపీని వాడుకునే ఆప్షన్ కూడా ఉంచుకోవాలనుకుంటోంది. కాని బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. అలా అని ఇన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామని కూడా చెప్పలేకపోతోంది.
పవన్ కల్యాణ్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించినా..
ఒకవైపు పవన్ కల్యాణ్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించేశారు.. అది కూడా తిరుపతి ఉప ఎన్నిక కోసం. ఇప్పుడు దాని నుంచి వెనక్కు వెళ్లలేరు. టీడీపీతో ఎట్టి పరిస్ధితుల్లో కలవం అని చెప్పేశారు.. దీని మీద వెనక్కి రాలేరు. మరోవైపు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీలో దండం పెట్టి.. రాష్ట్రంలో మాత్రం దండం ప్రయోగిస్తోంది వైసీపీ. అందుకే జగన్ను నమ్మాలంటే కష్టమని కమలనాథులు అనుకుంటున్నారు. అందుకే ఎన్నికల వరకు అందరి మీద విరుచుకుపడి..ఎన్నికల సమయానికి ఉన్నరాజకీయ వాతావరణాన్ని బట్టి వ్యూహాలు… ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని బిజెపి కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Must Read ;- మోదీ VS ముఖ్యమంత్రులు.. పెరుగుతున్న అసంతృప్తి