ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుగాంచిన మీడియా సంస్థలపైనా ఏపీ ప్రభుత్వం తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు చేస్తోంది.ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో తెలుగు న్యూస్ ఛానెళ్లు టీవీ5,ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను కూడా చేరుస్తూ ఏపీ సీఐడీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ కేసుపై రఘురామకృష్ణరాజు ఓ వైపు ఏపీ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తుండగా… మరోవైపు టీవీ5, ఏబీఎన్లు కూడా తమదైన శైలి పోరుకు తెర తీశాయి.ఈ పోరులో ఆదిలోనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సదరు ఛానెళ్లు… జగన్ సర్కారుకు షాకిచ్చాయి.
వైసీపీ అభ్యర్థిగానే..
గడచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగానే నరసాపురం నుంచి బరిలోకి దిగిన రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలిచారు.ఆ తర్వాత కొంతకాలం పాటు అంతా బాగానే ఉన్నా…తనదైన శైలి పరిచయాలు కలిగిన రఘురామకృష్ణరాజు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతోనే మాట్లాడుతుండటం,కేంద్ర మంత్రులను చాలా ఈజీగా కలుస్తుండటం తదితర ఘటనల నేపథ్యంలో ఆయనకు వైసీపీకి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.వాస్తవానికి రఘురామకృష్ణరాజు తొలుత బీజేపీ నేతగానే కొనసాగారు.ఆ పార్టీ అభ్యర్థిగానే నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు కూడా.మొన్నటి ఎన్నికలకు ముందు వరకు కూడా ఆయన బీజేపీలోనే ఉన్నారు.అయితే అనూహ్యంగా సరిగ్గా ఎన్నికలకు సమయం దగ్గరపడిన సమయంలో రఘురామకృష్ణరాజు బీజేపీని వీడి వైసీపీలోకి చేరిపోయారు.ఈ క్రమంలో పాత పరిచయాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజును ఓ సారి పార్లమెంటు ఆవరణలోనే స్వయంగా ప్రధాని పలకరించిన వైనం వైరల్గా మారిపోయింది.
ప్రభుత్వ విధానాల్లోని లోపాలను లేవనెత్తుతూ..
వైసీపీలో తాను ఒంటరి అయ్యాయన్న భావనతో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల్లోని లోపాలను లేవనెత్తూతూ రఘురామకృష్ణరాజు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు.వీటిని పలు తెలుగు న్యూస్ ఛానెళ్లతో పాటు జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది.తాజాగా ప్రభుత్వంపై కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానే చర్చనీయాంశంగా మారిపోయింది.రఘురామకృష్ణరాజు కేసులో… ఆయన మీడియా సమావేశాలను ప్రత్యేకంగా కవర్ చేశారన్న సాకును చూపి టీవీ5, ఏబీఎన్లపై కూడా రాజద్రోహం అభియోగాల కింద సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు.తనపై నమోదు చేసిన కేసులపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో ఏపీ సర్కారుపై పోరు సాగిస్తున్నారు.ఇలాంటి తరుణంలో టీవీ5, ఏబీఎన్లు కూడా ఏపీ ప్రభుత్వంపై పోరు మొదలెట్టేశాయని చెప్పాలి.
సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలంటూ..
తమపై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన రాజద్రోహం కేసులను కొట్టేయడంతో పాటుగా సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని కూడా టీవీ5, ఏబీఎన్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ పిటిషన్లలో సదరు సంస్థలు కోర్టును ఏమని అభ్యర్థించాయన్న విషయానికి వస్తే… ‘‘రఘురామకృష్ణరాజు విద్వేష వ్యాఖ్యలను ప్రసారం చేశామంటూ మాపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు.ఉద్దేశ పూర్వకంగానే మమ్మల్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు.మా సంస్థలతో పాటుగా మా ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలి.సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలి’’అని విన్నవించాయి.ఇప్పటికే రఘురామకృష్ణరాజు పిటిషన్పై సుప్రీంకోర్టు వేగంగా స్పందించిన నేపథ్యంలో టీవీ5, ఏబీఎన్ల పిటిషన్లపైనా కోర్టు అదే రీతిన స్పందిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- సుప్రీంలో రఘరామరాజుకు ఊరట.. వై కేటగిరి భద్రత,ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు