నందమూరి కళ్యాణ్ రామ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోలేకపోయింది. అందుకే ఈ హీరో ఇప్పుడు థ్రిల్లర్స్ మీద దృష్టిపెడుతున్నాడు. ఇంతకు ముందు ‘118’ అనే మూవీతో అతడు బాగానే థ్రిల్ చేశాడు. ప్రస్తుతం కొన్ని థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ వింటున్నప్పటికీ.. ఓ మలయాళ థ్రిల్లర్ మీద మనసు పారేసుకున్నాడట. లాస్ట్ ఇయర్ జనవరిలో మాలీవుడ్ లో విడుదలైన ‘అంజామ్ పాదిరా’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్టయింది. లాస్ట్ ఇయర్ విడుదలైన మలయాళ చిత్రాల్లో ది బెస్ట్ గా నిలిచిపోయింది ఈ సినిమా.
పోలీస్ ఆఫీసర్స్ ను టార్గెట్ చేసి వారిని వరుసగా మర్డర్ చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకొనే విషయంలో ఒక క్రిమినాలజిస్ట్ పోలీసులకు ఎంతగానో సహాయపడతాడు. అతడు తన ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి.. ఆ హంతకుడ్ని ట్రేస్ చేసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఉత్కంఠతకు గురి చేస్తాయి. కుంచాకో బోబన్, రమ్య నంబిశన్ జంటగా నటించిగా.. ఉన్ని మాయప్రసాద్, షరాఫుద్దీన్, జిను జోసెఫ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మిథున్ మాన్యుల్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు లో కళ్యాణ్ రామ్ హీరోగా.. కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఇంతకు ముందు కె.వి.గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన తమ్ముడు యన్టీఆర్ , త్రివిక్రమ్ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ ను కూడా కళ్యాణ్ రామ్ తన ఓన్ బ్యానర్ లో తీయబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ఈ థ్రిల్లర్ మూవీ కళ్యాణ్ రామ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Also Read: టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు వస్తున్నాడు..!