Kiran Kumar Yadav Spotted With Home Minister Sucharitha :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ యాదవ్ ఫ్యామిలీ నిజంగానే వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పే ఆధారాలు ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన తర్వాత వివేకా హత్యకు దారి తీసిన కారణాలు, దాడి వెనుక ఉన్న గూడు పుఠానీ క్రమంగా వీడుతోంది. ఈ క్రమంలో పులివెందులలోని ఇంటికి తాళం వేసి మరీ గోవా చెక్కేసిన సునీల్ ఫ్యామిలీ జాడను పట్టేసిన సీబీఐ అధికారులు.. మంగళవారం గోవాలోనే సునీల్ ను అరెస్ట్ చేశారు. గోవాకు సీబీఐ అధికారులు చేరుకున్న విషయాన్ని పసిగట్టిన సునీల్.. అక్కడి నుంచి కూడా పారిపోయేందుకు యత్నించాడట. అయితే ఏపీ నుంచి గోవాకు వెళ్లిన సునీల్ జాడను పట్టేసి అక్కడికి చేరుకున్న సీబీఐ.. అతడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోదు కదా. సునీల్ ను గోవాలోనే వెంటాడి వేటాడి మరీ పట్టేసింది. ఆ తర్వాత గోవా నుంచి సునీల్ ను ప్రత్యేక వాహనంలో బెంగళూరు మీదుగా కడపకు తీసుకొచ్చింది. మంగళవారం మొత్తం అతడిని విచారించిన సీబీఐ అధికారులు.. బుధవారం నాడు అతడిని కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి.
హోం మంత్రితో సునీల్ తమ్ముడు
ఇదిలా ఉంటే.. సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ లో కనిపించిన ఓ ఫొటో వైరల్ గా మారిపోయింది. ఈ ఫొటోలో సునీల్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ఏకంగా రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. ఏదో విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు సుచరిత వద్దకు వెళ్లిన కిరణ్.. ఆమెతో కలిసి ఫొటో దిగిన వైనం చూస్తుంటే.. వైసీపీలో సునీల్ ఫ్యామిలీకి ఏ మేర ప్రాధాన్యం ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. 2020, అక్టోబర్ 27న తీసినట్లుగా చెబుతున్న ఈ ఫొటోపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తులకు రాష్ట్ర హోం మంత్రినే నేరుగా కలిసే యాక్సెస్ ఎవరు ఇచ్చారంటూ సంచలన కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి. సీబీఐ వెంటాడుతున్న ఈ వ్యక్తులకు హోం మంత్రిని కలిసే స్వేచ్ఛ ఎవరు ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఫ్యామిలీ మొత్తంపైనా అనుమానాలు
ఇక సీబీఐ దర్యాప్తులో సునీల్ ఫ్యామిలీ కేంద్రంగానే కీలక విచారణ సాగుతోంది. ఇదివరకే సునీల్ ను పలుమార్లు పిలిచి ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఓ సారి అతడిని ఏకంగా ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించి ఏకంగా నెల రోజులపాటు అక్కడే ఉంచి విచారించినట్లుగా తాజాగా తెలుస్తోంది. అంతేకాకుండా సునీల్ తో పాటు ఇప్పుడు హోం మంత్రితో కలిసి కనిపించిన అతడి సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ను కూడా సీబీఐ అధికారులు ఇదివరకే పలుమార్లు విచారించారు. సునీల్ తండ్రి కృష్ణయ్యతో పాటు అతడి తల్లిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. వివేకా పొలాలను పర్యవేక్షించే ఉమాశంకర్ రెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్న సునీల్.. ఆ క్రమంలోనే వివేకాకు దగ్గరయ్యాడట. ఆ తర్వాత సునీల్ ఫ్యామిలీ మొత్తం కూడా వివేకాకు సన్నిహితంగానే మెలగిందట. అయితే ఏమైందో గానీ.. వివేకాతో సునీల్ కు విబేధాలె పొడచూపడంతో అతడిని వివేకా దూరం పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వివేకా తన సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురి కావడం, ఆ తర్వాత విచారణకు రెండు సిట్ లు ఏర్పాటు కావడం, అయినా దర్యాప్తులో ఆశించిన మేర పురోగతి లేకపోవడం.. వివేకా కూతురు డాక్టర్ సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు డొంక మొత్తం కదులుతుండటం, అందులో తొలి అరెస్ట్ గా సునీల్ కుమార్ నే సీబీఐ పట్టుకోవడం చూస్తుంటే.. ఈ హత్య వెనుక సునీలే కీలకంగా వ్యహరించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు చిక్కుముడి మరికొన్ని రోజుల్లోనే వీడిపోనుందని కూడా చెప్పవచ్చు.
కోర్టుకు సునీల్ ఒక్కడే
ఇదిలా ఉంటే.. ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు బుధవారం మధ్యాహ్నం పులివెందులకు తరలించారు. అక్కడి కోర్టులో న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరిచారు. సునీల్ తో పాటు వివేకా ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ ను వివేకాకు పరిచయం చేసిన ఉమాశంకర్ రెడ్డిలను కూడా సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న వార్తలు వినిపించినా.. సునీల్ ఒక్కడినే కోర్టులో హాజరుపరిచింది. దీంతో వివేకా కేసులో తొలి అరెస్ట్ అధికారికంగా నమోదైనట్టైంది.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే











