Sunil Yadav Arrested In Y.S Vivekananda Reddy Murder Case :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఈ హత్య ఘటనకు సంబంధించి సుదీర్ఘ విచారణలు జరుగుతున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే.. వివేకా కూతురు సునీత ఫిర్యాదుతో హైకోర్టు ఈ అంశంపై కలగజేసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ కేసు దర్యాప్తును చాలా సీరియస్ గానే తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కడపలో తిష్ట వేసిన సీబీఐ బృందం ఇప్పటికే చాలా మందిని విచారించింది. ఈ విచారణలో పలు కీలక అంశాలను పట్టేసిన సీబీఐ.. తాజాగా వివేకాకు అత్యంత సన్నిహితంగా మెలగిన పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ తో వివేకాను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన వారి వెన్నులో వణుకు పుట్టించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఉన్నట్టుండి అదృశ్యమైన సునీల్
సీబీఐ విచారణకు ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన సునీల్ కుమార్ యాదవ్ గతంలో వివేకాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే కారణమేమిటో తెలియదు గానీ.. వివేకా హత్యకు కొద్దికాలం ముందు వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో సునీల్ ను వివేకా దూరం పెట్టారు. వైసీపీ ప్రారంభం అయిన నాటి నుంచి కూడా వైసీపీలో క్రియాశీల కార్యకర్తగానే కొనసాగుతున్న సునీల్.. పులివెందులలో తన వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ..2019 మార్చి 15న వివేకా తన ఇంటిలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత టీడీపీ సర్కారు ఓ సిట్ ను ఏర్పాటు చేయగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సిట్ ను రద్దు చేసిన జగన్ మరో సిట్ ను ఏర్పాటు చేశారు. అయినా కూడా ఈ కేసులో ఎక్కడా కదలిక రాలేదు. సీబీఐ ఎంట్రీతో ఈ కేసులో అనుమానితుల విచారణ మొదలు కాగా.. సునీల్ కుమార్ పలు దఫాలుగా విచారణకు హాజరయ్యారు. అతడితో పాటు అతడి సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, అతడి తండ్రి, తల్లి కూడా విచారణకు హాజరయ్యారు. వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్య వాంగ్మూలం ఇచ్చేనాటికి ఓ రోజు ముందుగా ఫ్యామిలీతో సహా సునీల్ అదృశ్యమయ్యాడు.
గోవాలో ఉండగా అరెస్ట్
రంగయ్య వాంగ్మూలం ఇచ్చిన మరునాడే సునీల్ ను మరోమారు విచారించాలని భావించిన సీబీఐ అతడికి ఫోన్ చేయగా.. ఫోన్ ఆఫ్ లో ఉండటం, ఇంటికి తాళం వేసిచ మొత్తం ఫ్యామిలీ కనిపించకుండా పోవడంతో అనుమానించిన సీబీఐ అధికారులు.. అతడి కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో సునీల్ బంధువుల ఇళ్లను జల్లెడ పట్టిన సీబీఐ.. సునీల్ కు అత్యంత సన్నిహితంగా ఉండే అతడి బంధువును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. సునీల్ గోవాలో ఉన్న విషయం తేలింది. దీంతో నేరుగా గోవాకు చేరుకున్న సీబీఐ అధికారులు సునీల్ ను సోమవారమే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళవారానికంతా కడపకు తీసుకొచ్చిన సునీల్ ను మరింత సమాచారం మేరకు విచారించారు. సునీల్ తమ అదుపులో ఉన్న విషయం మీడియాకు పొక్కడంతో సీబీఐ కూడా ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. సునీల్ ను గోవాలో అరెస్ట్ చేశామని, అతడిని బుధవారం కడప కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ప్రకటించింది. సునీల్ అరెస్ట్ అయ్యాడన్న సమాచారం తెలియగానే.. పక్కా ప్లాన్ ప్రకారం వివేకాను హత్య చేసిన నిందితుల్లో కలవరం మొదలైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వివేకాది ప్రీ ప్లాన్డ్ మర్డరే.. ఆ ఇద్దరు సూత్రధారులెవరు?