నిజంగానే ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా తమను తాము అభివర్ణించుకుంటున్న జగన్ జమానాలోనే ఈ తరహా కీలక ఘటన చోటుచేసుకుంది. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన సుంకర పావని, సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఫలితంగా విపక్ష తెలుగు దేశం పార్టీకి చెందిన వారిద్దరూ పదవులను కోల్పోనున్నారు. గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి చెందిన వారు కీలక పదవుల్లో కొనసాగడానికి వీల్లేదన్న రీతిలో వైసీపీ కీలక నేతలు భావించారు. ఆ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం.. మంగళవారం నాడు నెగ్గింది. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ అవిశ్వాస తీర్మానంలో పాలుపంచుకునేందుకు జిల్లాకు చెందిన మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం.
ఎన్నికల్లో టీడీపీ జయకేతనం
2017లో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అధికారంలో ఉన్న టీడీపీకి ఈజీగానే ఈ కార్పొరేషన్ దక్కుతుందని భావించినా.. వైసీపీ నుంచి కూడా గట్టి పోటీనే ఎదురైంది. అయితే వైసీపీ పోటీని తట్టుకుని నిలబడిన టీడీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. కాకినాడ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 2017లో 48 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో టీడీపీ 34 సీట్లలో గెలవగా.. వైసీపీ 8 చోట్ల, బీజేపీ, స్వతంత్రులు మూడేసి డివిజన్లను నెగ్గారు. కాలక్రమంలో ముగ్గురు కార్పొరేటర్లు మరణించగా.. ఓ కార్పొరేటర్ రాజీనామా చేశారు. దీంతో కార్పొరేషన్లో ప్రస్తుతం టీడీపీకి 30 మంది కార్పొరేటర్లు ఉండగా.. వైసీపీకి 8 మంది, బీజేపీకి ముగ్గురు, ఇండిపెండెంట్లుగా ముగ్గురు ఉన్నారు.
ద్వారంపూడి మంత్రాంగం
అయితే జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక.. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కన్ను కాకినాడ పీఠంపై పడింది. తమ జమానాలో టీడీపీ కార్పొరేటర్ మేయర్ గా కొనసాగడమేమిటన్న దిశగా ఆలోచన చేశారు. టీడీపీ, బీజేపీకి చెందిన కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్లనూ లాగేసే యత్నం చేశారు. తన యత్నాలు ఫలించిన తర్వాత మేయర్ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా ప్లాన్ చేశారు. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లలో 21 ఓట్లు టీడీపీ టికెట్లపై విజయం సాధించిన కార్పొరేటర్లవే కావడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో సుంకర పావని మేయర్ పదవి నుంచి దిగిపోక తప్పని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో సత్తిబాబు కూడా డిప్యూటీ మేయర్కు గుడ్ బై చెప్పడం ఖాయమే. ఈ మొత్తం పరిస్థితిని చూస్తుంటే.. జగన్ జమానాలో కాకినాడ కార్పొరేషన్ లో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టిందా? ఖూనీ అయ్యిందా? అన్నదానిపై సరికొత్త చర్చ మొదలైంది.
Must Read ;- ఆ ఇద్దరి ఎంట్రీతో సాయిరెడ్డికి కత్తెర