ఎంపీ.. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటేనే.. ఓ రేంజి డాబూ దర్పం ఒకలబోయడం షరా మామూలుగా మారిపోయింది. ఇటు జనం ఓట్లతో నెగ్గిన లోక్ సభ సభ్యులైనా, అటు పరోక్షంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులైనా తమదైన శైలి దర్పాన్ని ఒలకబోస్తుంటారు. గెలిచే దాకే ప్రజలంటే దేవుళ్లని కీర్తించే వీరంతా.. గెలిచాక తామే ప్రజలకు దేవుళ్లమని భావిస్తుంటారు. జనం దగ్గరకు తాము వెళ్లడం మాట అటుంచితే.. జనాన్ని తమ గడప కూడా తొక్కనీయకుండా మసలుకుంటూ ఉంటారు. అందరు ఎంపీలూ ఇలానే ఉంటారని చెప్పలేం. అయితే నూటికి 99 శాతం మంది ఎంపీలు అలాగే ఉంటారు. ఆ మిగిలిన 1 శాతం ఎంపీలు ఆ 99 శాతం మంది ఎంపీలకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఆ 1 శాతం ఎంపీల్లో తెలుగు నేల ఏపీకి చెందిన ఓ ఎంపీ కూడా ఉన్నారు. ఆమె మరెవరో కాదు.. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి. రాజకీయ కుటుంబం నుంచే వచ్చినా.. అవినీతి అంటే ఎరుగని వామపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నేత గొడ్డేటి దేముడు కూతురే మన ఎంపీ మాధవి.
తొలి అడుగే పార్లమెంటులో..
2019 ఎన్నికల ముందు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కొత్త వారికి చాలానే అవకాశాలు ఇచ్చారు. అలా గొడ్డేటి మాధవిని కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించిన జగన్ అరకు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిపిపి గెలిచేలా చేశారు. గొడ్డేటి దేముడుకు ఉన్న క్లీన్ ఇమేజీ మాధవితో పాటు పార్టీకి కూడా కలిసి వస్తుందన్న జగన్ వ్యూహం సక్సెస్ అయ్యింది. మాధవి ఎంపీగా గెలవడంతో పాటుగా ఆ నియోజకవర్గ పరిధిలోని దాదాపుగా అన్ని అసెంబ్లీలను వైసీపీ చేజిక్కించుకుంది. జగన్ రచించిన ఈ మాస్లర్ ప్లాన్ తో రాజకీయాల్లో తొలి అడుగే పార్లమెంటులో మోపిన మాధవి.. తనను గెలిపించిన ప్రజలను ఏమాత్రం మరిచిపోలేదు. తన మూలాలను అసలే మరువలేదు. ఎప్పుడు విశాఖ వచ్చినా.. తన సొంతూరితో పాటు తనను గెలిపించిన ప్రజల మధ్యనే తచ్చాడుతూ ఉంటారు.
ఇప్పుడేం చేశారంటే..
అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయాలను నేటి సమాజానికి తెలియపరిచే ఉద్దేశ్యంతో అరకు పరిధిలోని పెదలబుడు గ్రామంలో ” గిరి గ్రామ దర్శన్’’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇటీవలే మాధవి సందర్శించారు. సందర్శించడమే కాకుండా గిరిజన సంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టేలా చూపేందుకు ప్రత్యక్షంగా నడుం బిగించారు. ఇందులో భాగంగా సహచర ఎంపీలు వంగా గీత (కాకినాడ), రమ్య హరిదాస్ (అల్తూర్, కేరళ)లతో కలిసి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలోకి మారిపోయారు. గిరి సంప్రదాయాలను అనుగుణంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఇలా ఎంపీలై ఉండి కూడా ఈ ముగ్గురు ఎంపీలు గిరిజన వస్త్రధారణలోకి మారిపోయి.. గిరి సంప్రదాయాలను పాటిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- బాబు సవాల్కు జగన్ సిద్ధమా?