తెలుగు నేల విభజన తర్వాత ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లు ఉండగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 175, తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి దరిదాపుగా 300 మంది ఎమ్మెల్యేలతో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ కోలాహలంగా కనిపిస్తే. రాష్ట్ర విభజన తర్వాత ఏ ఒక్క రాష్ట్ర అసెంబ్లీలోనూ 200 మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోవడం లోటుగా కనిపించేదే కదా. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీలు.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటూ ఎప్పటికప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా అందుబాటులోకి వచ్చే అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడంతో పాటుగా.. పార్టీలో పదవులు చాలక అలకపాన్పు ఎక్కిన వారిని కూడా చల్లబరచవచ్చన్నది ఆ పార్టీల ఆలోచన. అయితే ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని వాయిదా వేస్తూనే వస్తోంది. తాజాగా ఇంకో ఐదారేళ్ల వరకు ఈ అంశంపై తమను ఇబ్బందిపెట్టవద్దన్న కోణంలో కేంద్రం ఇచ్చిన ఆన్సర్ తో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీఆర్ఎస్, వైసీపీల ఆశలపై నీళ్లు చల్లేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రేవంత్ ప్రశ్నకు కేంద్రం ఆన్సర్
తాజాగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి టీ పీసీసీ చీఫ్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ ప్రశ్న సంధించారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తారంటూ రేవంత్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం నాడు లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2026 జనాభా లెక్కలు పూర్తి అయితే గానీ.. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని, 2026 జానాభా లెక్కలు ఓ కొలిక్కి వచ్చాక.. వాటి ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని నిత్యానందరాయ్ సదరు సమాధానంలో తేల్చి పారేశారు. ఫలితంగా 2026 వరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మాటే వినపడదన్న మాట. అంటే.. 2023లో తెలంగాణ, 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పాత నియోజకవర్గాలు, పాత సంఖ్యతోనే జరుగుతాయన్న మాట.
సీట్లు పెరగకుంటే సర్దుబాటెలాగో..?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక.. అసలు విపక్షమన్నదే లేకుండా చేయాలన్న లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసిన సీఎం కేసీఆర్.. ఇతర పార్టీలకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాగూ సీట్ల సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా పాత నేతలకు ఇబ్బంది లేకుండా కొత్త నేతలను సర్దుబాటు చేయవచ్చని ఆయన భావించారు. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా అదే భావనతోనే ఉన్నారు. తన పార్టీలోని ప్రతి నేతా అసెంబ్లీ సీటు అడిగే వారే. ఎవరికి వారు తమను ఆకాశానికి ఎత్తేసుకుని.. తాము తోపులమంటూ ఫోజులు కొట్టేవారే. వీరిలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరు పడ్డ వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో 2024లోగా అసెంబ్లీ సీట్లు పెరిగితే.. అందరినీ సంతృప్తి పరచవచ్చని జగన్ భావించారు. అయితే ఇప్పుడు కేంద్రం చెప్పిన సమాధానంతో ఇటు కేసీఆర్ తో పాటు అటు జగన్ కూడా మలి ఎన్నికల్లోనూ ఇబ్బందులు పడక తప్పదన్న మాట.
Must Read ;- ఓటమి దిశగా వైసీపీ.. తేల్చేసిన జగన్ సర్వే