Is Lok Sabha Seats Going To Be Doubled` :
పార్లమెంటులో దిగువ సభ లోక్ సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 543. ఏళ్లుగా ఈ సంఖ్య అలా పెరగకుండా, తరగకుండా అలాగే కాన్ స్టంట్ గా ఉంటూ వస్తోంది. దేశంలో కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటవుతున్నా.. కశ్మీర్ లాంటి కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర హోదాను కోల్పోతున్నా కూడా లోక్ సభ సభ్యుల సంఖ్యలో మార్పు మాత్రం రావడం లేదు. మరోవైపు ఏటికేడు దేశ జనాభా అలా అలా పెరుగుతూనే వస్తోంది. అయినా కూడా నియోజకవర్గాల పునర్విభజన.. ఏదో ప్రాంతాల నైసర్గిక స్వరూపాలను మారుస్తూ జరుగుతోంది గానీ..పెరిగిన జనాభా ఆధారంగా సీట్లు మాత్రం పెరగడం లేదు. ఇదే అంశంపై దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అప్పుడెప్పుడో ఓ సంచలన వ్యాఖ్య చేశారు. చిన్న చిన్న దేశాలు కూడా తమ జనాభాకు అనుగుణంగా చట్ట సభల సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. మనం ఇంకా ఆ దిశగా ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెరసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చట్టసభల సభ్యుల సంఖ్యను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఆ వ్యాఖ్యల ప్రభావమో, లేదంటే తమ కొత్త వ్యూహం ఫలితమో తెలియదు గానీ.. మోదీ సర్కారు లోక్ సభ సభ్యుల సంఖ్యను పెంచేందుకు రంగం సిద్ధం చేసిందన్న వాదనలు కొత్త చర్చకు తెర తీసింది. సంఖ్యను పెంచడం అనే కంటే ప్రస్తుతమున్న లోక్ సభ ఎంపీల సంఖ్యను ఏకంగా డబుల్ స్థాయికి పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్న వార్దలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
మోదీ ప్రతిపాదన కాంగ్రెస్ నేత ట్వీట్ లో..
లోక్ సభ సభ్యుల సంఖ్యను ఏకంగా 1,000కి పెంచే దిశగా నరేంద్ర మోదీ సర్కారు చేస్తున్న కసరత్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత మనీశ్ తివారీ.. తన ట్విట్టర్ వేదికగా బయటపెట్టేశారు. లోక్ సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా వెయ్యికి పెంచే దిశగా మోదీ సర్కారు ప్రతిపాదనలు రూపొందిస్తోందని, దీనిపై జనాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తివారీ తన ట్వీట్ లో అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన వాదనకు నిదర్శనంగా.. కొత్తగా కడుతున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను వెయ్యి మందికి సరిపడేలా కడుతున్న వైనాన్ని ఆయన ఉదహరించారు. మనీశ్ అభిప్రాయపడుతున్నట్లుగా మోదీ సర్కారు ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నదంటే.. ఇది చాలా పెద్ద నిర్ణయమే కాబట్టి.. జనాభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల మోదీ సర్కారు వ్యవహారాన్ని పరిశీలిస్తున్న వారు.. ఈ విషయంలో మోదీ సర్కారు ఏ ఒక్కరి నిర్ణయంతో పనిలేకుండానే తాను అనుకున్నది చేసుకుంటూ పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశంలో మరో పెద్ద రచ్చకు తెర లేసినట్లేనన్న వాదనలూ లేకపోలేదు.
మనోళ్ల బలం వెయ్యేనుగులైనట్టే
మోదీ సర్కారు ప్రతిపాదిస్తున్న మాదిరిగా లోక్ సభ సీట్లు వెయ్యికి పెరిగితే.. అంటే దాదాపుగా రెట్టింపు సంఖ్యలు లోక్ సభ సీట్లు పెరిగితే.. తెలుగు రాష్ట్రాల బలం కూడా రెండు రెట్లు పెరిగినట్టే కదా. అంటే.. ఇప్పుడు ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 50కి పెరుగుతాయి. తెలంగాణలో ఉన్న 17 సీట్లు 34కు పెరుగుతాయి. ఈ మేర సీట్లు పెరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల బలం మాత్రం నాలుగింతల మేర పెరిగినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే.. ఏపీలో 25 సీట్లుంటే.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ లెక్కన మొత్తం సీట్ల సంఖ్య 50కి పెరిగితే.. ఇప్పుడున్న దామాషా ప్రకారం వైసీపీ బలం అమాంతంగా 44కు పెరిగినట్టే కదా. అదే సమయంలో టీడీపీ బలం 6 సీట్లకే పరిమితమవుతుంది. అంటే జగన్ బలం ఢిల్లీలో నాలుగు రెట్లు పెరిగినట్టే లెక్క. ఇక తెలంగాణ విషయానికి వస్తే..మొత్తం 17 సీట్లలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలిచింది. ఇప్పుడు సీట్లు డబుల్ అయితే ఆ పార్టీ బలం 18కి పెరుగుతుంది. ఇక కాంగ్రెస్ బలం 4 నుంచి 8కి, బీజేపీ బలం కూడా అంతేమేర పెరుగుతుంది. అంటే.. ఈ రెండు పార్టీల కంటే టీఆర్ఎస్ బలం మరింతగా పెరిగినట్లుగానే భావించక తప్పదు. ప్రస్తుతం ఉన్న బలానికే అటు వైసీపీని గానీ, ఇటు టీఆర్ఎస్ ను గానీ పట్టశక్యంగా లేని పరిస్థితి. అలాంటిది ఒక్కసారిగా ఆ బలం రెండింతలు, మూడింతలు, నాలుగింతల మేర పెరిగితే.. ఇక ఆ రెండు పార్టీలను ఆపతరమా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మోదీకి కలిసివచ్చేనా?
ఇదిలా ఉంటే.. లోక్ సభ సభ్యుల సంఖ్యను దాదాపుగా డబుల్ చేసే దిశగా జరుగుతున్న ప్రతిపాదనల వల్ల ప్రాంతీయ పార్టీలు.. ప్రత్యేకించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు బిగ్ బూస్ట్ దొరికినట్లే. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలకు మాత్రం ఈ ప్రతిపాదన అంతగా కలిసి రాదన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అలాంటి సమయంలో సీట్ల పెంపు వల్ల ప్రాంతీయ పార్టీల బలం పెరగడం, జాతీయ పార్టీల బలం నామమాత్రంగానే పెరగడం.. జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ప్రాంతీయ పార్టీల మద్దతుపై మాత్రమే ఆధారపడి కేంద్రంలో పాలన సాగించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. మోదీ సర్కారు తీసుకుంటున్న సీట్ల పెంపు వల్ల రాష్ట్రాలను శాసించే కేంద్ర ప్రభుత్వాల మనుగడకు చెల్లుచీటి ఇచ్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇంతటి ప్రభావం చూపే మార్పులపై మోదీ సర్కారు ఏ మేర దృష్టి సారించనున్నది అన్న అంశపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Must Read ;- తగ్గేది లే : పార్లమెంట్ కు ట్రాక్టర్ పై వచ్చిన రాహుల్ గాంధీ!











