వైసీపీ ముఠాతగాదాలు శృతిమించుతున్నాయి. తాజాగా వర్గాల కొట్లాటలు ఒకరి మరణానికి కూడ దారితీశాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే
గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల తగాదాలకు అడ్డేలేకుండా పోతోంది. అయితే ఈ సారి వైసీపీలోని రెండు వర్గాలు తలపడ్డాయి. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో ఓ రోడ్డు నిర్మించే విషయంలో స్థల వివాదం చోటు చేసుకుంది. వైసీపీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా వైసీపీలోని ప్రత్యర్థులు వదల్లేదు.
25 మంది కత్తులు, గొడ్డళ్లు, ఇనుప రాడ్డులతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిపై దాడికి దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక డాక్టర్లు, నర్సులు పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిపై రెండో సారి దాడి చేయడంతో వారి పరిస్థితి అత్యంత సీరియస్ గా మారింది. వారిలో ఒకరు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి గం.2.10కి చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది.
సాతులూరులో కూడా పెట్రేగిపోయారు..
కట్టుబడివారిపాలెం ఘటన జరుగుతుండగానే నరసరావుపేట నియోజకవర్గం సాతులూరులో హోటల్ నిర్వహిస్తోన్న మాలతిపై వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి దాడికి దిగాడు. భర్తను కోల్పోయి ఓ చిన్న హోటల్ నిర్వహించుకుంటూ మాలతి తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. హోటల్ స్థలంలో తనకూ హక్కు ఉందంటూ వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఆమెపై దాడికి దిగాడు. జీవనోపాధి పోవడంతో మహిళ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామంటూ పురుగుమందు బాటిల్ తో రోడ్డుపై నిరసన తెలిపారు.
తనకు అండలేదని, భర్తను కూడా కోల్పోవడంతో అడిగేవారు లేరని వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని మాలతి ఆరోపిస్తున్నారు. పోలీసులు న్యాయం చేయకుంటే తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆమె హెచ్చరించారు. మాలతికి జరిగిన అన్యాయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, మాలతికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Must Read ;- అధికార పార్టీలో కుంపటి రాజేస్తున్న కొత్త జిల్లాలు!











