ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాక వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రేషన్ వాహనాలపై పరిషత్ ఎన్నికలు ముగిసేవరకూ తటస్థ రంగులు మాత్రమే ఉండాలని ఆయన ఆ లేఖలో సూచించారు. స్థానిక ఎన్నికలు ముగిసిన తరవాత పరిషత్ ఎన్నికలు ఉంటాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 21 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. వెను వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారని తెలుస్తోంది.
అందుకే హడావుడి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది. ఆలోగా స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి, ఆ తరవాత రెండు దశల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పరిషత్ ఎన్నికల ప్రక్రియ సగంలో నిలిచిపోయింది. గత మార్చిలో పరిషత్ ఎన్నికలకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 24శాతం ఏకగ్రీవం అయ్యాయి. తాజాగా జరిపే పరిషత్ ఎన్నికల్లో పాత ఏకగ్రీవాలు రద్దు చేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది: రోజా