ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో అధికార వైపీపీ శ్రేణులు, మంత్రులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, బదిలీల విషయాల్లోనూ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య ఇంకా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ అభిమానులు వ్యక్తిగత విమర్శలకూ దిగుతుండడం ఇప్పటికే రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఉద్దేశించి వైసీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి, ఎన్ఆర్ఐ ప్రభాకర్ అలియాస్ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏప్రిల్ 1 తరువాత చంపేస్తామనే రీతిలో హెచ్చరికలు జారీచేస్తూ వీడియో పోస్టు చేశాడు.
కులాన్ని ఉద్దేశించి..
ఈ వీడియోలో డైరెక్ట్గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరు ప్రస్తావించలేదు. అయితే కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. టీడీపీ అధినేత చంద్రబాబుకి సపోర్టు చేయడానికి కేవలం కులమే కారణమని వ్యాఖ్యానించాడు. దుగ్గిరాలలో ఏం ఉందని వెళ్లావని, అక్కడ మీకు ఓటు హక్కు ఎందుకని ప్రశ్నించారు. నా** నీకు ఏప్రిల్ 1 తరువాత ఉందని, విజిలేస్తే శాల్తీ లేపేస్తారని చెబుతూనే.. చివర్లో ఆవేశంలో ఏదో అంటూ ఉంటామని, కాకపోతే జాగ్రత్త అని వ్యాఖ్యానించాడు.
Must Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!
ఇప్పటికే ఆయనపై కేసులు
కాగా పంచ్ ప్రభాకర్పై ఇప్పటికే ఏపీలో కేసులు నమోదయ్యాయి. గతంలో న్యాయవ్యవస్థలతో పాటు న్యాయమూర్తులను టార్గెట్ చేసిన అంశంపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా కామెంట్లు చేసిన వారిలో పంచ్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కుట్ర కోణంతోనే ఈ కామెంట్లు చేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో తొలుత సీఐడీ విచారణకు ఆదేశించిన హైకోర్టు.. తరువాత సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో మొత్తం 44మందికి నోటీసులు కూడా జారీ అయిన విషయం తెలిసిందే.
వ్యక్తిగత దాడులా..
కాగా పంచ్ ప్రభాకర్ చేసిన కామెంట్లను ఆ పార్టీ వ్యవహారశైలికి నిదర్శనంగా చెబుతున్నారు కొందరు మాజీ అధికారులు, పలు పార్టీలకు చెందిన నాయకులు. కుల పిచ్చి అని అందరినీ తిట్టే వారు.. వాళ్లే అందరి కంటే కుల పిచ్చివాళ్లుగా మారిపోయి వ్యాఖ్యలు చేయడం, ఎక్కడో ఉండి మాట్లాడడం ఏంటని ఆయన వీడియోకు కొన్ని కామెంట్లూ కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలి చట్టాలకు విరుద్దమైనప్పుడు న్యాయస్థానాలు అడ్డుకుంటాయని, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైతే, నిబంధనలు అమలు చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఏంటనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక రెండురోజుల క్రితం కడప జిల్లాలో పర్యటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు వైఎస్ ఆశీస్సులున్నాయని, భావ ప్రకటన స్వేచ్ఛతోపాటు తాను చెప్పాలనుకున్న అంశాన్ని ధైర్యంగా చెప్పేంత స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారని, వైఎస్ ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని, తనకు ఎప్పుడూ వైఎస్ ప్రత్యేక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తాను సీబీఐ కేసుల్లో సాక్షిగా ఉన్నానని, అవసరమైతే రానున్న కాలంలో కూడా సాక్ష్యం చెబుతానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు ఎన్నికల కమిషనర్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా కొందరు ఎన్నికల కమిషనర్ను బెదిరించే రీతిలో చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తారా లేదా అనేది తేలాలి.
Must Read ;- నిమ్మగడ్డది శునకానందం : గౌరవనీయ మంత్రి వ్యాఖ్య