దేశంలో మా హవానే నడుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ నాయకులు కిక్కురుమనకుండా ఉంటారులే అనుకుంటున్న బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజలు, కార్మీక సంఘ నేతలతో పాటు.. రాష్ట్రంలో పలు పార్టీలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం విశాఖ ఉక్కుపై నోరెత్తడం లేదు. పైగా కేంద్రమేమైనా నిర్ణయాన్ని ప్రకటించిందా.. ఒక ట్వీటును పట్టుకుని అందరరూ ఇంత యాగీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడడం చూస్తే వారి నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది.
బీజేపీ నిర్ణయాలు శోచనీయం..
తాజాగా బీజేపీకి విశాఖ ఉక్కు సెగ తగలడం మొదలైంది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న పలు నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయని చెప్పారు.. వాటికి వ్యతిరేకంగానే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసిన నేపథ్యంలో.. కేంద్రంలో బీజేపీ వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించారు. కానీ బీజేపీ హయాంలో ఏపీకి ఎటువంటి మేలు జరగకపోవడం చాలా బాధాకరమని ప్రకటించారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం చాలా దారుణమని, దీనివల్ల ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయకపోవడం, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపైనా కేంద్రం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా స్పందన లేదని విమర్శించారు. ఈ కారణాల వల్లే తాను బీజేపీని వీడాలని భావించానని చెప్పారు.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!