మరొక తెలుగు సాహిత్య సూరీడు అస్తమించాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవీప్రియ హైదరాబాదులో శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్న దేవీప్రియకు కొంతకాలం కిందట కాలు తొలగించారు. ఇటీవల ఆయన భార్య కూడా మరణించారు. భార్య వియోగం తట్టుకోలేక.. దేవీప్రియ చాలా డీలాపడిపోయారు. ఒకవైపు వేదన, మరోవైపు అనారోగ్యం వెరసి దేవీప్రియను బాగా కుంగదీశాయి. చివరికి ఆయన శనివారం నాడు తనువు చాలించారు.
తెలుగు ఆధునిక సాహిత్య చరిత్రలో దేవీప్రియ తనదైన సొంత అధ్యాయాన్ని రాసుకున్నారు. సునిశితమైన కవితలకు ఆయన పేరుపడ్డారు. ఆయన రాసిన గాలిరంగు కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సునిశితమైన వ్యంగ్యంతో ఆంధ్రప్రభ దినపత్రికలో ఆయన రాసిన రన్నింగ్ కామెంటరీ ఎందరినో ఆలోచింపజేసేది.
దేవీప్రియకు సినిమారంగం మీద కూడా మంచి పట్టు ఉంది. గౌతం ఘోష్ కు సహాయకుడిగా పనిచేశారు. ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. రంగుల కల చిత్రానికి దేవీప్రియ పాటలు రాశారు. జర్నలిస్టుగా, కవిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. డాక్యుమెంటరీ రూపకర్త కూడా.
దేవీప్రియ పేరుతో ఎంత సుప్రసిద్ధుడైన కవిగా ఎదిగారంటే.. ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు. గుంటూరులో 1949 ఆగస్టు 15న జన్మించిన దేవీప్రియ అసలు పేరు షేక్ ఖాజాహుసేన్.
ఆయన మృతి పట్ల పలువురు సాహితీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలియజేశారు. ది లియోన్యూస్ డాట్ కామ్ కూడా.. ఆయనకు నివాళి అర్పిస్తోంది.