తమిళ్ స్టార్ హీరో ఆర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరాణ్మణై 3’. సి. సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలవ్వాల్సిన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. ఇటీవల తిరిగి ప్రారంభం అయిన ‘అరాణ్మణై 3’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ‘అరాణ్మణై 3’ ఆఖరి షెడ్యూల్ ను చెన్నైలో ప్రారంభించింది చిత్ర బృందం.
చెన్నైలోని ఒక ప్రముఖ ఫిలిం స్టూడియోలో వేసిన భారీ సెట్ లో హీరో, హీరోయిన్, ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుందర్. అంతే కాకుండా క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే సెట్ లో జరపనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ‘అరాణ్మణై 3’ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ‘అరాణ్మణై 3’ మొదటి రెండు భాగాలు పెద్ద హిట్ అవ్వడమే. హారర్ నేపథ్యంలో వచ్చిన ఆ రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
‘అరణ్మణై’ మొదటి భాగం చంద్రకళగా తెలుగులో విడుదలై.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక మొదటి భాగంలో హన్సిక, రెండో భాగంలో త్రిష కథానాయికగా నటించగా.. ఇప్పుడు మూడో భాగంతో రాశీఖన్నా ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతోంది. ‘అరాణ్మణై 3’ సినిమా కూడా ముందు వచ్చిన రెండు భాగాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చినా వాటిని నిర్మాతలు సున్నితంగా తిరస్కరించారని, ఎట్టి పరిస్థితిలోనూ థియేటర్స్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో విజుల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, అవి థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుందని ఇప్పటికే నిర్మాతలు తెలియజేశారు కూడా. మరి ‘అరాణ్మణై 3’ సినిమా ద్వారా దర్శకుడు సుందర్ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.
Must Read ;- ట్రైలర్ టాక్ : 1రూపాయికే విమానయానం కల్పించిన వ్యక్తి కథ ‘ఆకాశం నీ హద్దురా’










