పి.కే టీం నివేదికలు కావొచ్చు.. జగన్ వ్యక్తిగత సర్వేలు కావొచ్చు.. ప్రకాశం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఆశించిన కొందరి నేతల ఆశలు 2019లో గల్లంతయ్యాయి. సీటు త్యాగం చేసిన వారిలో కొందరు జగన్కి బంధువులు అయితే, మరికొందరు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు, ఇంకొందరు అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్నవారు. అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దింపడంతో పాటు, రాజన్న బిడ్డను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి వైవీ వంటి వారు ఎంపీ సీటు త్యాగం చేస్తే.. జగన్ చెప్పిన మాట వింటే భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు 2019 ఎన్నికల్లో సీటును త్యాగం చేసి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించారు. కానీ, ఇప్పుడు వాళ్లే అసంతృప్తి గళాలు వినిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఎం.ఎల్.సి. పదవి దక్కలేదు. నాలుగు రాళ్లు వెనకేసుకునే పదవన్నా దక్కుతుందా అంటే.. టీడీపీలో గెలిచిన వారు వైసీపీలో చేరి తమ ఆశలకు అడ్డం పడ్డారని వారు రగిలి పోతున్నారు. పార్టీ అధిష్టానంపై విమర్శలు చేయకపోయినా.. పార్టీ టికెట్ ఇచ్చి ఎవరినైతే గెలిపించిందో.. టీడీపీ నుంచి ఎవరినైతే పార్టీలో చేర్చుకుందో.. వారిని ఇబ్బందులు పెడుతూ.. తమ సంగతేంటని ఇన్డైరెక్టుగా మెసేజ్లు పంపుతూ.., నియోజకవర్గంలో పార్టీని వర్గాల పేరుతో చీలికలు, పేలికలు చేస్తున్నారు.
ఎమ్సెల్సీ ఆశలు, ఆధిపత్యం తగ్గడమే కారణమా..?
ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కొండపి వైసీపీ ఇంఛార్జి అశోక్ బాబు పార్టీ కోసం ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేశారు. ఎన్నికల్లో కూడా సహకరించి జగన్ నిలబెట్టిన కుందూరు నాగార్జున రెడ్డి మార్కాపురం నుంచి , దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్లను గెలిపించారు. కొండపిలో మాత్రం సొంత పార్టీలోని అశోక్ బాబు డబుల్ గేమ్ ఆడటంతో అక్కడ వైసీపీ ఓడిపోయింది. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మొదట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత బానే ఉంది. కానీ, సీటు త్యాగం చేసినప్పుడు ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం.. నియోజకవర్గంలో తమ ఆధిపత్యం తగ్గడంతో ఇప్పుడు ఒక్కొక్కరు అసంతృప్తి గళాలు వినిపిస్తూ.. పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. బూచేపల్లి వర్సెస్ మద్దిశెట్టి ఆధిపత్య పోరు దర్శిలో పార్టీ పరువును నడిబజార్లో పాంపెట్ల రూపంలో నిలబెట్టింది. కొండపిలో అశోక్ బాబు వర్సెస్ ఓడిపోయిన వెంకయ్య వర్గం రోజూ వీధి పోరాటాలతో పంకా రెక్కలను డ్యామేజ్ చేస్తున్నారు. మార్కాపురంలో జంకే వెంకటరెడ్డి వివాదాల్లో లేకపోయినా.., ఆయన ఎమ్మెల్సీ ఆశలు గల్లంతవ్వడంతో పార్టీకి దూరంగా ఉన్నారు.
చీరాల, అద్దంకిలో గ్రూపుల రగడ..!
చీరాలలో ఢీ అంటే ఢీ అనుకునే ఆమంచి, కరణం 2019 ఎన్నికల ముందు వరకూ టీడీపీలోనే ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్.. బాబుపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీ తరఫున బరిలో దగడంతో.., కరణం బలరాం తప్పక ప్రత్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..ఆమంచికి షాక్ ఇస్తూ కరణం గెలవడంతో అక్కడ రోజూ రణరంగమే. అయినా, వైసీపీ అధికారంలో ఉండటంతో కాపు సామాజికవర్గం కోటాలో ఎంఎల్సీ తీసుకుని..అదృష్టం కలిసి వస్తే మంత్రి అవుదామనుకున్న ఆమంచి ఆశలు.. కరణం ఇప్పుడు అనధికారికంగా వైసీపీలో చేరడంతో గల్లంతయ్యాయి. దీంతో ఇద్దరూ తమ ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇక్కడ ఇద్దరికీ పార్టీ అధిష్టానం కూడా చెప్పి చెప్పి అలసిపోయింది. అద్దంకిలో బయట పడకపోయినా కరణం వైసీపీలో చేరడంతో.. బాచిన చెంచు గరటయ్య వర్గం ఇక్కడ కరణం ఆటలు చెల్లవు అంటోంది. కొన్ని రోజుల క్రితం అద్దంకిలో ఏర్పాటు చేసిన కరణం పుట్టిన రోజు ఫ్లెక్సీలను గరటయ్య వర్గం చించేసింది. ఇప్పటి వరకూ వైసీపీ అధిష్టానం డిసైడ్ చేయకపోయినా? తాత్కాలికంగా కరణం వెంకటేష్కి అద్దంకి బాధ్యతలు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు గొట్టిపాటి రవిని వైసీపీలో చేరాలని తనవెంట ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే అద్దంకి వైసీపీకి చీరాలను మించిన తలనొప్పులు తప్పవని ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైవీ జోక్యం చేసుకుంటే..
జగన్ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో జగన్ కోసం ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంటకు వదులు కోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత కొన్నాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన తాడేపల్లి జగన్ ఇంటి ప్రారంభోత్సవానికి కూడా వెళ్లలేదు. కుటుంబ సభ్యులు, పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో మధ్యే మార్గంగా టీడీపీ ఛైర్మన్ పదవి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇది పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో మైనస్గా మారింది. వైసీపీలో నియోజకవర్గాల్లో గ్రూపుల మధ్య గొడవల్ని సర్దిచెప్పే నాయకుడు లేకపోవడంతో అవి మరింత ముదిరి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మంత్రి బాలినేని మాటను దర్శిలో బూచేపల్లి, చీరాలలో ఆమంచి వినే పరిస్థితి కనిపించడం లేదు. బాలినేనితో పాటు వైవీ రంగంలోకి దిగితే.. కొండపి, దర్శి, మార్కాపురం, కనిగిరిలో పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉందని.. లేకపోతే టీడీపీ పరిస్థితే తమకు పడుతుందని సన్నిహితుల వద్ద కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అధిష్టానం అసంతృప్తి నేతలకు పదవులిచ్చి గ్రూపుల గొడవల్ని సైలెంట్ చేస్తుందో లేక ఇంఛార్జిలను మార్చి ఉండే వాళ్లు ఉండండి.. పోయోవాళ్లు పోండని స్పష్టం చేస్తుందో తెలియాలంటే.. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఆగాల్సిందే..!











