కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు చూస్తుంటే.. క్రమంగా భారత రక్షణ రంగంలోకీ ప్రైవేటు సంస్థలు చొచ్చుకువచ్చే ప్రమాదం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు ఉపసంహరించినా.. రక్షణ రంగాన్ని మాత్రం ముట్టుకోమని చెబుతూ వస్తున్న మోదీ సర్కారు.. ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా రంగంలోకి ప్రైవేటు కంపెనీలకు గేట్లు బార్లా తెరిచే దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో జరుగుతున్న కీలక కార్యక్రమాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. వెరసి ఇప్పటిదాకా అంతరిక్ష పరిశోధనా రంగంలో సొంత పరిజ్ఙానంతో ఎన్నో అద్భుతాలను సృష్టించి, అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయించిన ఇస్రో తన ప్రాభవాన్ని కోల్పోతోందా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇస్రో అమ్ములపొదిలో తిరుగులేని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్వీ) తయారీ ఇక కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే దిశగా ఇప్పుడు వడివడిగానే అడుగులు పడుతున్నాయి.
షార్ కు ఇక నామమాత్రమే?
ఇస్రో తలపెట్టిన అంతరిక్ష ప్రయోగాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మొట్టమొదట వినిపించే పేరు.. పీఎస్ఎల్వీ. తిరుగులేని అంతరిక్ష వాహకనౌక. ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన శాటిలైట్లను తీసుకుని నింగి వైపు దూసుకెళ్లే వాహక నౌక ఇది. ఇన్నేళ్లత పాటు ఇస్రో సొంతంగా దీన్ని తయారు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అధికారం ఇస్రో చేతుల్లో నుంచి జారిపోనుంది. పీఎస్ఎల్వీల తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసింది. ఇందులో భాగంగా పీఎస్ఎల్వీ తయారీ పనులు ఇక కార్పొరేట్ పరం కానుంది. దీనికి అనుగుణంగా- పీఎస్ఎల్వీల తయారీ కాంట్రాక్ట్ను పొందడానికి బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతోన్నాయి. పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ను పొందడానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియాలు రేసులో నిలుచున్నాయి. ఈ రెండు కన్సార్టియాలతో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) సింగిల్ కంపెనీగా బిడ్స్ను దాఖలు చేసింది. ఈ బిడ్లను కేంద్రం ఖరారు చేస్తే.. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)కు పనేమీ లేకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
కార్పొరేట్ల జట్లు ఇవే!
గుజరాత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన కంపెనీ అదాని గ్రూప్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ లతో జట్టు కట్టి కన్సార్టియంగా ఏర్పడింది. అలాగే- ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది. ఈ రెండింటితో పాటు బీహెచ్ఈఎల్ సింగిల్ కంపెనీగా బిడ్ దాఖలు చేసింది. ఈ బిడ్స్ అన్ని టెక్నో-కమర్షియల్ ఎవాల్యూషన్ కింద ఉన్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పర్యవేక్షణలో కార్యకలాపాలను సాగిస్తోన్న కంపెనీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. గత నెల 30వ తేదీ వరకు అదాని గ్రూప్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలైనట్లు ఆయన చెప్పారు. ఎవాల్యూషన్ పూర్తయిన తరువాత.. అర్హత సాధించిన కన్సార్టియాన్ని ఎంపిక చేస్తామని, పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ పనులను దానికి అప్పగిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.
Must Read ;- 6 లక్షల కోట్లు కావాలి!.. ఏమేం అమ్మాలి?