Radhika Re-Entry Into Tollywood :
రాధిక .. నిన్నటితరం కథానాయికలలో ఆమె స్థానం ప్రత్యేకం .. ఆమె నటన విలక్షణం. తెరపై చలాకీగా కనిపిస్తూ .. చురుకైన పాత్రలను పోషించిన హీరోయిన్. ఒక వైపున విజయశాంతి .. రాధ .. భానుప్రియ .. గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ, ఆమె తనదైన రూట్లో ముందుకు వెళ్లారు. 80వ దశకంలో అత్యధిక చిత్రాలను చేసిన కథానాయికగా ఆమె కనిపిస్తారు. ఏఎన్నార్ .. శోభన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. ఇక కృష్ణంరాజు … చిరంజీవితో ఆమె చేసిన సినిమాలు చాలావరకూ సంచలన విజయాలనే నమోదు చేశాయి.
80వ దశకంలో తెలుగులోనే కాదు .. తమిళంలోను ఆమె వరుస సినిమాలను చక్కబెట్టారు. అక్కడి స్టార్ హీరోల జోడీగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 90వ దశకంలో ఆమె తెలుగు సినిమాలను తగ్గించారు. తమిళ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అక్కడ వరుసగా చేస్తూ వెళ్లారు. ఇతర హీరోయిన్లు అక్కడ ఆమె ధాటికి తట్టుకోలేకపోయారంటే ఆమె జోరు ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆకతాయి పాత్రలను ఆమె ఎంత అద్భుతంగా పోషించారో, బరువైన పాత్రలలోను అంతే గొప్పగా నటించారు. ఆనాటి కథానాయికలలో ఎమోషన్ సీన్స్ చేయడంలో రాధిక తరువాతనే ఎవరైనా అనిపించుకున్నారు.
తెలుగులో రాధిక అభినయానికి నిదర్శనం చూపాలంటే .. నిర్వచించాలంటే ‘స్వాతిముత్యం‘ .. ‘స్వాతికిరణం‘ సినిమాలు సరిపోతాయి. బరువైన ఆ పాత్రలను రాధిక తప్ప మరెవరూ చేయలేరని అనిపించకమానదు. తెలుగు సినిమాలను చాలా కాలం పాటు దూరంగా ఉన్న రాధిక, ఆ తరువాత ‘రాజా ది గ్రేట్‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె చేసిన కానిస్టేబుల్ అనంతలక్ష్మి పాత్ర గుర్తుండి పోతోంది. ఇక ఈ తరహా పాత్రలో ఆమె బిజీ అవుతారని అనుకుంటే మళ్లీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆమె నాగశౌర్య – అనీష్ కృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఆమె పాత్ర చాలా కీలకం అంటున్నారు. ఇకపై తెలుగులో వరుస సినిమాలు చేయాలని రాధిక నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే సీనియర్ హీరోయిన్లకు గట్టిపోటీ తప్పనట్టే.
Must Read ;- అందంలో నుంచి పుట్టిన అరుదైన విలనిజం!











