80వ దశకంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రమ్యకృష్ణ ఒకరు. అందం .. అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయికగా అభిమానులతో అభినందనలు అందుకున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు పైకి చేరుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఆమె తన జోరును కొనసాగించారు. విజయశాంతి .. రాధ .. భానుప్రియ వంటి నాయికలు దూసుకుపోతున్న సమయంలో, వాళ్లతో పాటు బరిలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. స్టార్ హీరోలందరితోను హిట్లు అందుకున్నారు.
అలాంటి రమ్యకృష్ణ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా గొప్పగా పోషించారు. ‘నరసింహ’ సినిమాలో ఆమె పోషించిన ‘నీలాంబరి‘ పాత్ర అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తరువాత ఆ స్థాయిలో ఆమెకు పేరు తెచ్చినది ‘శివగామి’ పాత్రనే. ‘బాహుబలి‘ సినిమాలో అహంభావం .. త్యాగం కలిసిన ఈ పాత్రలో రమ్యకృష్ణ నటన ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ పాత్రను రమ్యకృష్ణ అంత గొప్పగా మరెవరూ చేయలేరు అని ప్రేక్షకులంతా చెప్పుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
అప్పటి నుంచి రమ్యకృష్ణకి పవర్ఫుల్ రోల్స్ చాలానే వచ్చాయి. కానీ తనకి నచ్చిన వాటిని మాత్రమే ఆమె ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘లైగర్‘ .. ‘రిపబ్లిక్‘ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు పాత్రలు కూడా దేనికవే విలక్షణమైనవి. అయితే ‘రిపబ్లిక్’ సినిమాలో ఆమె ఓ పవర్ఫుల్ పొలిటీషియన్ పాత్రను పోషించారు. ‘విశాఖ వాణి’ అనే పాత్రలో ఆమె జీవించారని అంటున్నారు. తన మాటే నెగ్గాలి .. తన ముందు ఎవరైనా తగ్గాలి అనే తరహాలో ఆమె నటన హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఆమెకి మరింత పేరు తీసుకొచ్చిన పాత్రల సరసన ఈ పాత్ర చేరడం ఖాయమని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- పవర్ స్టార్ సరసన నిత్యామీనన్.. షూట్ కి ముహూర్తం ఫిక్స్











