ఐపీఎస్ అధికారిగా ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ ది ఓ ప్రత్యేక స్థానం. పోలీసు అధికారిగా ఏ హోదాలో పనిచేసినా.. ఆ పదవికి వన్నె తెచ్చిన ప్రవీణ్.. తదనంతర కాలంలో విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. తన తొలినాళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. తనలా పేద పిల్లలు ఇక ఎంతమాత్రం అవకాశాలు లేవని, వాటిని తాము అందుకోలేమని బాధపడరాదన్న భావనకు వచ్చారు. అనుకున్నంతనే.. ఐఏఎస్ లకు మాత్రమే దక్కే గురుకులాల సొసైటీ కార్యదర్శి పోస్టు కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టి తన పంతం సాధించుకున్నారు. గురుకులాల సొసైటీకి ఓ ఐపీఎస్ ను నియమించారు.. ఆయన ఏం చేస్తారు? అన్న వాదనల నుంచి ఇకపై ఆ పోస్టుకు వచ్చే ఏ అధికారి అయినా తన బాటలోనే నడవాలన్న రీతిలో ఆ సంస్థ తీరుతెన్నులను మార్చేవేశారు. అదే సమయంలో ఆ సంస్థల్లో చదివే పిల్లలు.. ఇతర ఏ వర్గాల పిల్లల కంటే కూడా తక్కువ కాదన్న రీతిలో తనదైన వ్యూహాలకు పదును పెట్టిన ప్రవీణ్.. అందులో రికార్డు ఫలితాలను సాధించారు. అందరూ తనను చూసి నేర్చుకునేలా ఓ రేంజికి ఎదిగిపోయారు. పనిలో పనిగా ఆ సంస్థ బాగోగులే తన పమరావధి కాదని ఎప్పుడో నిర్ణయించుకున్న ప్రవీణ్.. ఆ సంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులను ఏకం చేసేందుకు స్వెరోస్ పేరిట ఓ సంస్థనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐపీఎస్ సర్వీసుకు ఆరేళ్ల ముందుగానే పదవీ విరమణ చేసిన ఆయన జెండా, అజెండా అంతా కూడా స్వెరోస్ వేదికగానే జరగనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.
రిటైర్మెంట్ కు ఒక్క రోజులోనే అనుమతి
ఐపీఎస్ సర్వీస్ కు ఆరేళ్ల ముందుగానే స్వచ్ఛంద పదవీ విమరణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్కటంటే ఒక్క రోజులోనే ఆమోదించింది. సోమవారం ప్రవీణ్ రిటైర్మెంట్ ప్రతిపాదన చేస్తే.. మంగళవారం నాడే ఆ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన టీ సర్కారు.. మంగళవారమే విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ స్థానంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఐఏఎస్ రొనాల్డ్ రోస్ను నియమించింది. మరోవైపు,రాజీనామా తర్వాత ప్రవీణ్ కుమార్ అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భవిష్యత్లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ఆయన మాటల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడుతారా?.. లేక మరేదైనా పార్టీలో చేరుతారా? అన్న చర్చ జరుగుతోంది. పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ప్రవీణ్ కుమార్ జనంలోకి వెళ్లారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై తానింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. అదే సమయంలో రాజకీయాల్లోకి రావడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారుతుందనుకోవడం కూడా సరికాదని ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. తన భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
అంతా ముందస్తు వ్యూహమే!
ఇదిలా ఉంటే.. ఐపీఎస్ కు రాజీనామా ప్రకటించిన తర్వాత వరుసగా పలు మార్లు మీడియాతో మాట్లాడిన ప్రవీణ్.. తన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్న విషయాన్ని తన అనుచర వర్గానికి క్లిస్టర్ క్లియర్ గానే చెప్పేశారు. బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి న ప్రవీణ్.. తాను ఇతర పార్టీల్లో చేరుతున్నట్లు కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారని.. అలాంటి ఫేక్ ప్రచారాలను, వార్తలను నమ్మవద్దని కోరారు. తన జీవితం మొత్తం మహనీయులు పూలే,అంబేడ్కర్,కాన్షీరాం బాటలో,వారి ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈ ఒక్క వ్యాఖ్యతోనే ప్రవీణ్ తన భవిష్యత్తు కార్యాచరణ మొత్తం స్వెరోస్ వేదికగానే సాగుతుందని చెప్పేశారు. ఇతర పార్టీల్లో చేరేది లేదని తేల్చేసిన ప్రవీణ్.. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై త్వరలోనే ప్రకటిస్తాని చెప్పారు. దీంతో స్వెరోస్ లక్ష్యంతోనే ముందుకు సాగనున్నట్లుగా ప్రవీణ్ చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ప్రియాంకాజీ.. ఇది మరీ టూ మచ్ అండీ











