13 IPS Officers Transferred In AP :
ఏపీలో అధికారులు.. ప్రత్యేకించి శాంతి భద్రతలు పర్యవేక్షించే ఐపీఎస్ అధికారులకు సంబంధించిన బదిలీలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వారం క్రితమే రెండు జిల్లాల ఎస్పీలను మార్చేసిన జగన్ సర్కారు.. బుధవారం ఏకంగా మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 13 మంది అధికారుల్లో 12 మంది అధికారులకు కొత్తగా పోస్టింగ్ లు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఒక్క ఐపీఎస్ అధికారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వకుండా.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సదరు ఐపీఎస్ కు ఆదేశాలు జారీ చేసిన వైనం కలకలం రేపుతోంది.
12 మందికి పోసింగ్..
బుధవారం ఉదయమే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో బదిలీ అయిన 12 మంది ఐపీఎస్ లకు పోస్టింగ్ లను ఇచ్చిన ప్రభుత్వం.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తూ తాజాగా బదిలీ అయిన నారాయణ్ నాయక్ కు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం..ఆయన స్థానంలో రాహుల్ దేవ్ శర్మను నియమించింది. అయితే నారాయణ్ నాయక్ కు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించింది. జాబితాలోని ఓ అధికారికి రెండు పోస్టింగ్ లు కట్టబెట్టిన ప్రభుత్వం.. నారాయణ్ నాయక్ కు మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
నాయక్ కు పోస్టింగ్ లేదు
అయినా ఇప్పుడు నారాయణ్ నాయక్ ఎందుకు టార్గెట్ అయ్యారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి తానేటి వనిత చెప్పినట్లుగా నాయక్ నడుచుకోవడం లేదట. ఏదో విషయంలో మంత్రి ఆదేశించిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని మంత్రికి తేల్చి చెప్పిన నాయక్.. మంత్రికి దాదాపుగా ఎదురు తిరిగినంత పనిచేశారట. దీంతో మంత్రి, ఎస్పీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగిందట. ఈ క్రమంలో విషయం తెలిసిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి నాయక్ తో మాట్లాడారట. వనితకు వ్యతిరేకంగా వెళ్లవద్దని తనదైన శైలిలో చెప్పారట. అయితే నిబంధనలకు విరుద్ధంగా తాను వెళ్లలేనని నాయక్ మరోమారు తన వైఖరిని తేల్చి చెప్పారట. దీంతో కుదరదులే అనుకున్న మంత్రులు.. నాయక్ ను బదిలీ చేయించడంతో పాటుగా తమ మాట వినకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామన్న రీతిలో నాయక్ కు పోస్టింగ్ ఇవ్వకుండా చేశారట. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
Must Read ;- ఎల్వీఎస్, పీవీఆర్ మాదిరే పీపీని గెంటేశారే