టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను చూస్తుంటే.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో క్రమంగా భయాన్ని పెంచుతోందనే చెప్పాలి. సోమవారం నాటి గుంటూరు పర్యటన, తాజాగా మంగళవారం నాటి కర్నూలు జిల్లా పర్యటనల్లో నారా లోకేశ్ కు జనం నుంచి వెల్లువెత్తిన మద్దతే ఈ తరహా వాదనలకు బలం చేకూరుస్తోందని చెప్పాలి. లోకేశ్ టూర్లతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంటే.. జనం కూడా స్వచ్ఛందంగా లోకేశ్ కు మద్దతుగా నిలుస్తున్న వైనం ఆసక్తి రేకెత్తించేదే. మంగళవారం లోకేశ్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం మొత్తం జై టీడీపీ, జై లోకేశ్ నినిదాలతో హోరెత్తిపోయింది. అంతేకాకుండా లోకేశ్ ను చూసేందుకు, ఆయనతో మాట కలిపేందుకు వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంతగా జన సందోహాన్నే తలపించింది.
ఎర్రబాడు ఘటనకు ఏడాది
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన హజిరబీపై గతేడాది సరిగ్గా ఇదే రోజు అంటే.. 2020 ఆగస్టు 17న హత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హజిరబీపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటనపై నాడే కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటిదాకా నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చలేదు. అసలు ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో కూడా తెలియదు. ఈ ఘటనపై తనదైన శైలిలో సమాచార సేకరణ చేసిన లోకేశ్.. ఈ ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తి అయిన సందర్భంగా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ఎర్రబాడుకు బయలుదేరారు. కర్నూలు మీదుగా ఎర్రబాడు చేరుకున్న లోకేశ్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హజిరబీపై నాడు జరిగిన దాష్టీకంపై మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన భరోసాపై ఆరా తీశారు. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉంది? అసలు పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారా? లేదా? అని కూడా లోకేశ్ ఆరా తీశారు. అనంతరం జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు చెరిగిన లోకేశ్.. హజిరబీపై హత్యాచారం జరిగి మంగళవారం నాటికి సరిగ్గా ఏడాది దాటిందని గుర్తు చేశారు. దిశ చట్టంతో 21 రోజుల్లోనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు కదా.. మరి హజిరబీ కేసులో ఇప్పటిదాకా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా ఈ పర్యటనతో జగన్ సర్కారును లోకేశ్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు.
కర్నూల్లోనూ ఆటంకాలే!
సోమవారం నాడు బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి నివాళి అర్పించడంతో పాటుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలతో కలిసి లోకేశ్ గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ ను ఎక్కడికక్కడ అడ్డుకునేలా వైసీపీ శ్రేణులు, పోలీసులు యత్నించిన వైనం తెలిసిందే. తాజాగా మంగళవారం నాటి కర్నూలు జిల్లా పర్యటనలోనూ లోకేశ్ ను అడ్డగించే యత్నాలే జరిగాయి. కర్నూలు నుంచి ఎర్రబాడు బయలుదేరిన లోకేశ్ కాన్వాయ్ పై దాడికి ప్లాన్ వేసిన వైసీపీ శ్రేణులు.. ఆయన వెళ్లే మార్గంలోనే ఇతర కార్యక్రమాల పేరు చెప్పి ఎంట్రీ ఇచ్చారు. అయితే గుంటూరులో చోటుచేసుకున్న ఘటనలను గుర్తు చేసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇటుగా వచ్చేందుకు అనుమతించేది లేదని వైసీపీ శ్రేణులకు చెప్పిన పోలీసులు.. కనీసం వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. అంటే.. ముందస్తు వ్యూహం మేరకే అక్కడికి వైసీపీ శ్రేణులు చేరుకుంటే.. పోలీసులు కూడా ఓ డ్రామాను తలపించేలా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై ఇప్పటికే ఓ స్పష్టమైన అవగాహనతోనే ఉన్న లోకేశ్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కు తగ్గేది లేదన్న దిశగా కదిలిన వైనం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- నారా పిడికిలి యమా స్ట్రాంగ్ గురూ!