జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. కొద్ది సేపటి క్రితం ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఎక్కువ మంది సభ్యులు ఎన్నికల బహిష్కరణకే మొగ్గు చూపారు. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు తమ అభిప్రాయాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేశారు. ఎన్నికలు బహిష్కరిద్దామని ఎక్కువ మంది పొలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబుకు తెలిపారు. తుది నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.
క్యాడర్ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు..
ఎన్నికలు బహిష్కరిస్తే గ్రామాల్లో పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తన అభిప్రాయాలను చంద్రబాబుకు చెప్పారు. గ్రామాల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు కూడా విలువనిచ్చి వారికి సమస్యను వివరించి తుది నిర్ణయం ప్రకటించాలని కొందరు టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబుకు వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయం చంద్రబాబు ప్రకటించనున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం నిర్వహంచాల్సిన మీడియా సమావేశం వాయిదా పడింది. సాయంత్రం జరగనున్న మీడియా సమావేశంలో చంద్రబాబు తుది నిర్ణయం వెల్లడించనున్నారు.
Also Read:ఎస్ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన











