రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావమో.. కేసీఆర్ ఆలోచనలో మార్పో తెలియదు గానీ ఉద్యోగులకు ఆయన వరుస గుడ్ న్యూస్లు చెబుతున్నారు. దీపావళి రోజు జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రూ.3వేల జీతం పెంచుతూ ప్రకటిస్తే, ఈ రోజు ఆర్టిసి కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాన్ని చెల్లిస్తూ మరో గుడ్ న్యూస్ చెప్పారు.
కరోనా నేపథ్యంలో లాభాల్లో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తక్షణమే రూ. 120 కోట్లను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. హైద్రాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సిఎం నిర్ణయించారు. ఆర్జీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాలపై కూడా సీఎం చర్చించారు.
ఆదివారం ప్రగతి భవన్ లో ఆర్టీసిపైన సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసిని తిరిగి బతికించుకుంటామని సిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… ‘‘ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తున్నది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్నది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా, వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తున్నది.
Also Read ;- విడతల వారీ లేటుగా జీతాలు.. ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతున్న ఉద్యోగులు
నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంట…
అయినా తెలంగాణ ప్రభుత్వం వెకకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది. అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకోని తిరిగి గాడిన పెట్టేదాక నేను నిద్రపోను. నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంట. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయి. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటకే పెండింగులో వున్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలి. అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి..’’ అని సిఎం స్పష్టం చేశారు.
ఆర్టీసీపై సొంత వాహనాల ప్రభావం..
కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని, తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ కు వివరించారు. కాగా, కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సిఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడను అధికారులను అభినందించారు.
సీటీలో బస్సు సర్వీసుల పెంపు..
సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ కరోనా అనంతర పరిస్థితులనుంచి ఒక్కొక్క వ్యవస్థ గాడిన పడుతున్నది. ప్రజలు బైటికొస్తున్నరు. హోటళ్లు, దాబాలు తదితర ప్రజావసరాల రంగాలు తిరిగి కోలుకుంటున్నవి. జన సంచారం క్రమ క్రమంగా పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాలో లోతుగా చర్చించండి.’’ అని సిఎం అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్ కు జిల్లాలనుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని, అందుకోసం హైద్రాబాలో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
పీఆర్సీ,డీఏ కావాలి…
జీతాల చెల్లింపు విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనపై భిన్నాబిప్రాయాలను ఆర్టీసీ యూనియన్ నేతలు, కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కోరుకునేది కరోనా సమయంలో పెండింగ్లో పెట్టిన జీతాలు కాదనీ, పీఆర్సీ, డీఏను ప్రకటించాలని కోరుతున్నారు. పీఆర్సీ, డీఏ మరచిపోవడానికే ఈ జిమ్మిక్కులను ఆరోపిస్తున్నారు. దయచేసి పీఆర్సీ, డీఏ ఇప్పించాలని సీఎంను కార్మికులు, నేతలు కోరుతున్నారు.
Also Read ;- సంపాదకీయం : ఈ విజయం- తెలంగాణ అవసరం!