జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాయి. దీంతో చోటామోటా నాయకులతో పాటు రాజకీయ నేతలు, వీఐపీ, వీవీఐపీల వాహనాలను తెలంగాణ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో ఈ తనిఖీలను పోలీసు శాఖ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేశ్ కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు. నారా లోకేష్ ఈ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో కాన్వాయ్ను ఆపి పోలీసులు తనిఖే చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరిన సమయంలో కాన్వాయ్లోని వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు 95 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీని పూర్వవైభవం దిశగా నడిపించేందుకు ఈ ఎన్నికలపై టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. దీనికనుగుణంగానే ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు నారా లోకేష్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ని పోలీసులు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!











