కోవిడ్ కారణంగా దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడటంతో పాటు షూటింగులు ఆగిపోయి చిత్ర పరిశ్రమ స్థంబించిపోయిన సంగతి తెలిసిందే. మొదులే పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చిత్రసీమకు కోవిడ్ మహమ్మారి మరిన్నికష్టాలను, నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తెలుగు సినీరంగం తమ సమస్యలను, థియేటర్ల పునః ప్రారంభానికి చేపట్టవలసిన చర్యలను రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకరువు పెట్టింది. పరిశ్రమ రీస్టార్ట్ కోసం రాయితీలు ప్రకటించమని అభ్యర్ధించింది. ఆ మేరకు పలువురు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు కూడా. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక రాయితీలను తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రాయితీలలో తెలంగాణ పరిధిలోని థియేటర్లకు విద్యుత్ రాయితీ కూడా ఒకటి. మరోవైపు ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలమని ప్రకటించినప్పటికీ ఆ రాయితీలపై నిర్ణయం అధికారికంగా ఎప్పుడు వెలువడుతుందా అని పరిశ్రమ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వచ్చింది.
ఎట్టకేలకు శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగులో తెలుగు చిత్ర పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజ్ ఇస్తున్నట్లు,, అలాగే థియేటర్ల పునః ప్రారంభానికి మూడు నెలల పాటు విద్యుత్ రాయితీని ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ, ఏపీలలో థియేటర్లను పునః ప్రారంభించుకోమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ చాలా తక్కువ సంఖ్యలోనే థియేటర్లు తెరుచుకున్నాయి. సాధారణంగా ఏవైనా కొత్త సినిమాలు విడుదల కావాలంటే రెండు రాష్ట్రాలలో ఒకేసారి విడుదల చేస్తారు. ఏపీ థియేటర్లకు కూడా తాజాగా రాయితీలు ఇస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించడంతో రెండు రాష్ట్రాలలోని థియేటర్ల పునః ప్రారంభానికి అడ్డంకులు తొలగిపోయినట్లే అని అనుకుంటున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాలలోని థియేటర్లు తెరచుకుంటాయని చెబుతున్నారు.
Must Read ;- థియేటర్స్ ఓపెన్.. మరి ఆడియన్స్ వస్తారా..?