The Military Battalion In The Movie Magadheera Has Devastated Afghanistan :
సైతాన్ ఫౌజ్.. ఈ పేరెక్కడో విన్నట్లు ఉందా? అదేనండీ.. మన తెలుగు సినిమా హీరో రాంచరణ్ తేజ్ ను ఓ రేంజికి తీసుకెళ్లిన ఎస్ఎస్ రాజమౌళి సినిమా ‘మగధీర’లో వినిపిస్తుందీ మాట. షేర్ ఖాన్ పాత్రధారి శ్రీహరి.. తన సైన్యంలోని అరివీర భయంకరుల పటాలానికి సైతాన్ ఫౌజ్ అనే పేరు పెట్టారు. ఆ పటాలాన్ని పిలిచే క్రమంలోసైతాన్ కీ ఫౌజీ అంటూ ఆయన తనదైన వాయిస్ మాడ్యులేషన్ తో చెప్పిన డైలాగ్ ఇంకా మనకు గుర్తే. ఆ పటాలంలోని వారిని చూస్తే.. నిజంగానే దానికి తగిన పేరునే పెట్టారని అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘన్ కష్టాలకు కారణమైనది కూడా ఈ పటాలం మాదిరి ఓ ముఠానే. దాని పేరు కూడా సైతాన్ ఫౌజ్. అయితే సినిమాలోని సైతాన్ ఫౌజ్ కళ్లకు కనిపిస్తుంది. ఆఫ్ఘన్ లోని సైతాన్ ఫౌజ్ మాత్రం కళ్లకు కనిపించదు. మొత్తం సైనిక వ్యవస్థనే కుప్పకూల్చింది. వెరసి యావత్తు దేశాన్ని తాలిబాన్ల వశం చేసింది. అంటే.. తెలుగు సినిమా యాక్టర్ శ్రీహరి నోట వినిపించిన సైనిక పటాలం సైతాన్ ఫౌజ్ ఆఫ్ఘన్ ను సర్వ నాశనం చేసిందన్న మాటేగా.
ఎన్నెన్ని దేశాల సాయమో..?
అప్పటికే ఓ సారి తాలిబాన్ల చెరలో చిక్కుకుని విలవిల్లాడిన ఆఫ్ఘన్ కు అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు విముక్తి కల్పించాయి. అంతేనా.. ఉగ్రవాదుల చెరలో చేతిలో చిల్లిగవ్వ లేని ఆఫ్ఘన్కు అన్ని రకాలుగా అమెరికా సాయం చేసింది. ఇతర దేశాలూ ఆ దేశానికి సాయం చేసేలా ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే ఆఫ్ఘన్ పార్లమెంటును భారత్ స్వయంగా నిర్మించి ఇచ్చింది. ఇలా 20 ఏళ్లుగా వివిధ దేశాల సహకారంతో అమెరికా.. అఫ్ఘానిస్థాన్ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసింది. దేశ భద్రత కోసం 3.50 లక్షల మంది సైనికులను సిద్ధం చేసింది. వారికి అధునాతన ఆయుధాలను అందజేసింది. పటిష్ఠమైన వైమానిక దళాన్ని తయారు చేసింది. అయినా.. 75వేల మంది తాలిబన్ ఫైటర్ల ముందు 3.50 లక్షల మంది బలంతో కూడిన అఫ్ఘాన్ సైన్యం మోకరిల్లడానికి కారణమేం టి? ఇందుకు గత నివేదికలు చెబుతున్న ఒకే ఒక్క సమాధానం.. సైతాన్ ఫౌజ్. అఫ్ఘాన్ సైన్యంలో పెట్రేగిన అవినీతికి నిదర్శనమే ఈ ఘోస్ట్ సోల్జర్స్. బ్రిటన్ పత్రిక ‘ద గార్డియన్’ 2016లో ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. అందులో.. హెల్మాండ్ ప్రావిన్స్లో రికార్డుల్లో ఉన్న సైనికుల సంఖ్యకు.. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారి సంఖ్యకు పొంతనే లేదని పేర్కొంది. అక్కడ క్షేత్రస్థాయిలో సుమారు 40 మంది జాడే లేదని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున తుపాన్ వజీర్ అనే రాజకీయ విశ్లేషకుడు హెల్మాండ్ ప్రావిన్స్లోని ఓ సైనిక బేస్ వద్ద తనిఖీ చేయగా.. 100 మంది సైనికులకు బదులు కేవలం 15 మందే పనిచేస్తున్నట్లు గుర్తించారు. మిగతా 85 మంది సైనికులు వాస్తవానికి లేకున్నా.. రికార్డుల్లో మాత్రం ఉన్నట్లు చూపిస్తూ.. వారి జీతాలను సైన్యంలోని కమాండర్లు, ఉన్నతాధికారులు తమ జేబుల్లో వేసుకుంటున్నట్లు తేల్చారు. అంటే ఆయా పరిశోధన కథనాలు పేర్కొన్న ఈ సైతాన్ ఫౌజ్.. కళ్లకు కనిపించేది కాదు. వాస్తవానికి లేకున్నా.. రికార్డుల్లో మాత్రమే కనిపించే సైనికులు.
పాలకులది ప్రేక్షక పాత్ర..
ఆ నివేదిక ప్రభుత్వానికి అందినా.. ఎలాంటి చర్యలు లేవని ‘ద గార్డియన్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశ భద్రతకు పనిచేస్తున్న సైనికులకు తిండి కూడా సరిగ్గా పెట్టరని సిగర్ నివేదిక వెల్లడించింది. ఫలితంగానే తాలిబాన్లు మే నెలలో ఆక్రమణలు ప్రారంభించాక.. మర్హాజ్ ప్రాంతంలోని సైనికుల బేస్ను 2 నెలల పాటు దిగ్బంధించారు. వారికి ఆహారం అందకుండా చేశారు. ఫలితంగా.. ఆహారం కోసం సైనికులు తమ మెషీన్ గన్లను త్యాగం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక కూడా అఫ్ఘాన్లో 3.50 లక్షల మంది సైనికులు లేరని, వాస్తవ సంఖ్య 2.54 లక్షలేనని తేల్చేసింది. సైతాన్ ఫౌజ్ జీతాలను కమాండర్లు తమ జేబుల్లో వేసుకున్నారని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అనే సంస్థ గుర్తించింది. కాందహార్, జుబుల్, హెల్మాండ్, ఉర్జాన్ ప్రావిన్సుల్లో 50-70ు సైనికులు కేవలం రికార్డుల్లోనే ఉన్నారని సిగర్ మరో నివేదికలో వెల్లడించింది. సైతాన్ ఫౌజ్కు తోడు.. ఉన్న సైనికులే వెన్నుపోట్లకు పాల్పడడం కూడా అఫ్ఘాన్ సైన్యాన్ని మానసికంగా దెబ్బతీసింది.
Must Read ;- హీరో గడ్డ తాలిబాన్ల అంతు చూసింది